Monday, 3 August 2015

సంగీతంలో సాహిత్య సౌరభం

సంగీతంలో సాహిత్య సౌరభం 


" సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః కుచ ద్వయం
ఏక మాపాత మధురం యేక మాలోచ నామృతం"
అని విజ్ఙుల యభిప్రాయం. సంగీత సాహిత్యాలు వాగ్దేవత చదువులతల్లి సరస్వతి కి స్తన ద్వయము వంటివట. అందొకటి సంగీతము .ఆపాత మధురమట! చెవుల బడినంతనే మనస్సును మైమరపించు శక్తి గలదని దాని భావము. మరియొకటి సాహిత్యం యిది యాలోచనామృతమట! విన్నతదుపరి లేదా చదివిని తదుపరి యాలోచించిన మీదట గాని దానిస్వారస్యము బోధపడదు. అయినను అది యమృత తుల్యము. ఈరెండును సరస్వతికి స్తన ద్వయమట! యేమి వేరుగా పోలిక చెప్పనగునుగదా? స్తన ములతోనే యేలపోలిక యను ప్రశ్న మనలో యుదయిపక మానదు.
వక్షోజములు సప్రయోజనములైనవి. అవి పాలిండ్లు. జీవులకు జీవనదములు. యగుట నాజగన్మాత స్తన ములతో బోలిక జెప్పవలసి వచ్చినది.తల్లి బిడ్డకు స్తన్యమిచ్చి సాకురీతిగా , నాజగన్మాతయు బిడ్డలమైన మనల నందరను విజ్ఙానస్తన్య మొసగి పెంచుట యోగ్య మను తలంపున నెవరో యీపోలికను జక్కగా జెప్పినారు. ఇది యుక్తి యుక్త మనుటలో సందేహము లేదు. యివిరెండును లలిత కళలు . రెంటిలో సంగీతము మిగుల మార్దవ మైనది. రెండవది కొంచెము సులభగ్రాహ్యముగాదు దానికి కొంత పరిశ్రమ యవసరము. అయినను వీని రెంటికి వాగ్గేయ కారులు చక్కని మైత్రిని గల్పించినారు. యివి పరస్ఫర సహకార కళలై లోకమున నేక ముఖముగా సాగుచు ప్రజా హృదయములకు మిగుల చేరువ యైనవి.
సంగీత మనేక విధములు. మనభారత దేశమున 1 కర్ణాటక 2 హిందుస్థానీ భేదములతో నిది రెండు రీతులుగా వర్ధిల్లుచున్నది. యిప్పుడు అది యవసరాను కూలముగా యనేక మార్పుల నొంది విశ్వరూపమును ధరించినది. మనవరకు కర్ణాటక హిందుస్థానీ భేదములను మాత్రమే పరిగణించుట యుక్తము. ప్రస్తుతము మనయధ్యనము కర్ణాటక సంగీత మందలి కృతులలో లేదాకీర్తనలలో సంగీతముతోబాటు విలసిల్లిన సాహిత్య స్వరూపము, దానియంద చందములు, దానియౌన్నత్యమును గురించిమాత్రమే నని తెలియగలరు.
కర్ణాటక సంగీతమును ప్రోది చేసిన వారుగా శ్రీ త్యాగరాజ స్వామి ,శ్రీముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్రి , ముఖ్యులు! వీరిని వాగ్గేయ కార త్రయముగా దక్షిణ భారతమున పరిగణించు చున్నారు. సశాస్త్రీయమైన సంగీతమునకు వీరు పెట్టినది పేరు. వీరు మువ్వురు రచనలలో భిన్న మార్గముల నవలంబించినారు. సాహిత్య మెటులైనను సంగీతము మాత్ర మొకటే! వీరే ఆగామి సంగీత విద్వాంసులకు మార్గ దర్శనము గావించినారు. వీరుగాక పెక్కురీ రంగమున ప్రసిధ్ధులై వెలసిన వారెందరోగలరు. తామర తంపరగా , పరస్సహ స్రముగా విస్తరిల్లిన యందరిని పేర్కొన జాలమి కేవలము త్యాగ రాజ స్వామి కృతులకు మాత్రమే యీయధ్యయనమును పరిమితము జేసి సంగీతము నందలి సాహిత్య పరిమళములను వివరించుటకు గడంగు చున్నాను. సహృదయులు. సంగీత ప్రియులు దీనిని సమాద రించి ప్రోత్సహింతురుగాక!
త్యాగరాజస్వామి వారి కృతులలో గణపతి ప్రార్ధనతో నీకార్యక్రమ మును ఆరంభింతము.
సౌరాష్ట్ర రాగం - ఆది తాళం
ప: శ్రీ గణ పతినీ సేవింప రారె - శ్రిత మానవు లారా! : శ్రీ :
అ: ప: వాగాధిపతి - సుపూజల గైకొని , బాగనటింపుచు వెడలిన : శ్రీ;
చ: పనస నారికేళాది జంబూ-ఫలముల నారగించీ -
ఘనతరంబుగను మహిపై పదముల- ఘల్లు ఘల్లన నుంచి
అనయమున హరు చరణ యుగములను -హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుని- వివిధగతుల థిత్తళంగు థకతోదోమని వెడలిన, :శ్రీ: 

నేటి కితటి తో విరమింతము .త్యాగరాయ కృతుల స్వరూప స్వభావములను రేపు దెలిసి కొని, యాపై నీకృతికి గలసాహిత్యము నవలోకించి ముందు కేగుదముగాక! సెలవు!

Monday, 20 July 2015

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితారీతులు - బమ్మెఱ పోతన

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితారీతులు
బమ్మెఱ పోతన 
_____________
ఉ: క్షోణితలంబు నెన్నుదురు సోకగఁ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితా నత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్;
కవిత్రయానంతరము నిజమునకు శ్రీనాధుని స్మరింప వలసి యున్నను, యీవరకే యాతని జీవిత ప్రస్థానాధ్యనమును మనము పూర్తి చేసియుండుటచే ప్ర స్తుతము పోతన కవీంద్రుని కవితా మార్గములను బరిశీ లింపఁ గడంగి నాఁడను .
తెలుగున మహాభాగవత నిర్మాతగా పరమ భాగవత శ్రేష్ఠుని గాఁ బేరొందిన బమ్మెఱ పోతన వరంగల్ సమీపము నందలి బమ్మెర నివాసి. 14 శతాబ్ది చివరి వాడు. తల్లి లక్కమ తండ్రి కేసన. ఇతడు పండిత కవిగాడు. గురుముఖతః నెవ్వరి చెంతను విద్య నభ్య సించినవాఁడు గాడు. సరసీజాసను రాణి వాణి కరుణా ప్రసాద లబ్ధ కవితా వైభవముఁగలవాడు. యితని పాండిత్య మంతయు సహజమే కావుననే " సహజపాండిత్య బిరుద మీతనిని వరించినది. శ్రీరామ చంద్రుని పరమభక్తుఁడైన నితఁడు ఆస్వామి ప్రేరణమేరకు , సంస్కృత మున వేదవ్యాస విరచితమగు శ్రీ మన్మహా భాగవతమును దెనిఁగించి,యొంటిమిట్ట(ఏకశిలాపురము) నేటి యోరుగల్లు పట్టణమునగల కోదండ రామ స్వామికి యంకిత మొనరంచి తరించెను. ధనమునకగాని, యగ్రహారములకుగాని, బిరుదములకొఱకుగాని , పేరు ప్రఖ్యాతుల కొఱకుగాని యితడాసింపక ప్రలోభరహితుఁడై భగవదంకిత మొనరించి తరించెను. నాటికే గాదు, నేటికి గూడనిది విచిత్రమే!
పోతనకు సిరి సంపదలు లేవు. స్వల్పముగా వ్యవసాయ క్షేత్రము మాత్రము గలదు. అదియు మెట్ట భూమి వర్షాధారము. పండిన పండును. లేదా నిష్పలమే పంట . యిట్టిస్థితి లోఁగూడ చలింపక ,, క్షేత్రమునే నమ్ముకొని తనప్రయత్నమే ఫలసాయముగా వ్యవ సాయముఁ జేయుచు , నొకవంక నాగలిని, వేరొకఃవంక గంచమును కదలించుచు యతఁడొనరించిన కవితా, క్షేత్ర వ్యవసాయములు సఫలములై యతనిని కృతార్ధు నొనరించినవి. కన్నులముందు నిలచి వాణి కలమునకు సాయమై నిలువ కమ్మని కవిత తో నాధ్యత్మిక పరిమళములను పరుగులు పెట్టించెను. భాగవత కర్తృత్వమునితఁడు తనపై నిలుపు కొనలేదు.
కం:- పలికెడిది భాగవత మట !
పలికించెడు వాఁడు రామభద్రుండట! నే
పలికిన భవహర మగునట!
పలికెద, వేరొండు గాధ పలుకఁగ నేలా?
యనుచు పలుకుటకు, పలికించుటకు రామభద్రునే కర్తగాఁబేర్కొనెను. యెంతటి భక్తి భావము! యెంతటి నిరీహ!సృష్టి లో నటువంటి వారుండుట యరుదుగదా! 12 స్కంథముల మహాగ్రంధము ఆరామ చంద్రుని కృపాకటాక్షముల మాటుననే చకచక సాగిపోయినది. లౌకిక ప్రయోజనముల నాసించి పోతన భాగవత రచనకుఁ గడంగలేదు. కేవల మోక్షమునకే యాప్రయత్నము .
శ;:- శ్రీ కైవల్య పదంబుఁ జేరుచకునైఁ జింతించెదన్ , లోక ర
క్షై, కారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు, మహానందాంగనా డింభకున్;
అంకితముగా నిచ్చునట! అందుకు ప్రతి ఫలము మోక్షమేనట! ఆహా! పోతన కవీంద్రా! నీవంటివారు మరల నీక్షోణిలో జన్మంతురా? మేముఁజూడగలమా?యేమో స్వామీ! నీకు నీవే సాటి!
చ:- లలిత స్కంథము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఙేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై;
భాగవత మొక కల్ప వృక్షమట. దానికి కృష్ణుడు మూలమట. అందమైన స్కంధములే శాఖలట. శ్రీ శుకుఁడనే చిలుక కూతలతో నిపైనదట. మనోహర వర్ణనలే లతలట. సు వర్ణము లనే సుపర్ణములున్నవట. అందమైనకథయనే కాండంతో కూడియున్నదట. మహాఫల యుక్తమట(గొప్పఫలితములే దాని పండ్లు) నిర్మల మూర్తి వ్యాసుడే దానికి యాలవాలమట. (ఆలవాలమంటే బోదె చెట్టు నివసించు చోటు) సజ్జన శ్రేయార్ధమై వెలసినదట. దీని పేరే భాగవత మట. ఆహా యెంత యుక్తియుక్తముగ చెప్పినావయ్యా! నీమాట యదార్ధమే! మాకిది కల్పవృక్షమై సకలశ్రేయములను సమకూర్చు చున్నది. పోతనృకవీంద్రా నీవు నెలకొల్పిన యీభాగవత వృక్షము సంసార దుఃఖభాజనులకు దివ్యౌషధమై యాధ్యాత్మిక ఫలదాయకమై యలరారు చున్నది. ధన్యులము స్వామీ ధన్యులము.
కవితా గుణములను జెప్పుట మాని భాగవత రచనా పరిశీలనకు పూనుకొంటి రేమి యని మిత్రులు ప్రశ్నింప వచ్చును. యేమిచేతును? పోతనను దలచి నంతనే చిత్త ముప్పొంగును. రిత్తవిషయములు ముచ్చటింప మనసాడదు. పరమ భాగవతుని భాగవతమున గల కవితా రీతుల నరయుటకు ముందాతని జీవన విశేషముల నించుక యైనను తడవకున్న మనశ్ర మ యంతయు యేటిలోఁబిసికిన చింతపండు వొడువున పరార్ధమునకూగాక,ఃపరమార్ధమునకూ గాక వ్యర్ధఎమగునేమో యనిఃనాసంశయము. 
కం:- కొందరకుఁదెనుఁగు గుణమగు
కొందరకుం సంస్కృతంబు గుణమగు రెంటన్
గొందరకు గుణములేయగు
నందర మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్;
పోతన కవీంద్రుఁడు తన కవితారీతు లివ్వియని యెక్కడనుబేర్కొని యుండలేదు. బహుశః కర్తృత్వము రామభద్రుని పైనిడుట నాయవకాశమునాతడు వినియోగించుకొనలేదేమో? నిజమే! చెప్పెడు మాటయొకటి చేసెడు చేత యింకొకటియైన నొప్పదుగదా! పోతన సత్య వ్రతుఁడు. హద్దు దాటువాడుగాదు. అందు యాకవిత్వ మంతయు దివ్యమైన భవ్యమైన యాధ్యాత్మిక పరీమళములతో నలరారినది. పోతన ధ్యాన మగ్నుఁడై యున్నపు డాభగవన్నిర్దిష్ట ములైన భావములు స్ఫురించుచుండగా కలముతో పద్యములను రచియించెడివాడట!
అయినను , మాన్యులను , సామాన్యులను మెప్పించు రీతిలో తనకవిత నడచునని యది పండిత వర్గమును పామర వర్గమును గూడ మెప్పించు రీతిగా సాగునని మాత్రమే పైపద్యమున సూచించినాడు. నాటి కింకను సంస్కృత పండితుల యాధిక్యము తగ్గలేదు. అప్పు డప్పుఁడే యచ్చతెలుఁగు పైమమకారము కొందరకు పొడము చున్నది. శివకవుల పనియదియేగదా! దేసి వాదము విస్తరంచినది. కావున తెలుఁగు కవిత్వమునే యభిమానించు వర్గమొకటి తయారైనది. 1 సంస్కృత భాషాభిమానులు2 తెలుఁగు భాషాభిమానులు( దేసివర్గము )3 తత్సమ పదమిళితమైన యాంధ్రపదాభిమానులు. వీరందరను తనకవిత తోమెప్పింతు నని పోతన సూచనము. సూచనయేగాదు యట్టి పద్యముల రచనలతో నిజముగనే త్రివర్గములను ఒప్పించి మెప్పించెను.
ప్రాయికముగా నీతని కంద పద్య రచన తెనుఁగు నకు పట్టముఁగట్టగా , వృత్తరచన తత్సమ పదసంయుతమై యలరారు చుండును. మరికొన్నిచోట్ల సుదీర్ఘమైన సంస్కృత సమాస విజృంభణము కాననగు చుండును. పోతన కవిత మందార మకరందములకు మారుపేరు. జుంటి తేనియల తియ్యదనము, విరిబాలల సోయగము( మెత్తదనము) వెన్నెలల చల్లందనము.ఃమలయమారుతపు పరీమళశైత్యములీతని కవిత లో గానవచ్చు చుండును. పోతన శబ్దాలంకార ప్రియుఁడు. ప్రతిపద్యమున నంతోయింతో శబ్దాలంకార ప్రయోగ ముండక తప్పదు. దీనివలన అజంత మైన మనభాషకు యొకచక్కని "లయ" కల్పించెను.ఒకఅపూర్వమైన అందమును చేకూర్చను. పద్యమును చదివినంతనే మనకు అర్ధమయినను, లేకున్నను హృదయమునకు యెంతో హాయిగానుండును. యిక పాత్ర చిత్రణమునను, వర్ణనల యందును నితఁడు సిధ్ధహస్తుఁడు. ఆయాదృశ్యములేమి పాత్రలేమి వానివాని యహార్యములతో, స్వరూప, స్వభావములతో, మనకన్నులముందు సాక్షాత్కరించును.
తెలుఁగు పద్య రచనాచాతుర్యము నీక్రింది పద్యములయందు గమనీయము
కం: కఱిఁదిగుచు మకరి సరసికి
కఱిఁదరికిని మకరిఁదిగుచు గఱకఱిఁ బెరయన్
కఱికి మకరి మకరికిఁగరి
భరమగుచును నతలఁ గుతల భటులదరిపడన్;
కం:అడి గెద నని కడు వడిజను
నడిగినఁ దన మగుడ నుడువఁడని నడయుడుగున్
వెడ వెడ జిడిముడిఁ దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్;
పైపద్యముల లో నన్నియు తెలుఁగు పదములేయగుట గమనీయము. అంతేగాక యమకమను శబ్దాలంకారము పెత్తనము చెలాయించినది.
తత్సమ పదప్రయోగచాతుర్యము నీక్రిందిఃపద్యములలో గమనితురుగాక!
మ: అటగాంచెన్ కరణీ విభుండు నవ ఫుల్లాంభోజ కల్హారమున్
నట దిందీ వర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
జటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబు గాసారమున్;
మ: ఆదిన్ శ్రీ సతి కొప్పుపైఁ దనువుపై యంశోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోల తటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందుఁ గరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మే
ల్గాదే! రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
చక్కని తత్సమపదలాలిత్యము పదాంత్య ప్రాస వ్న్యాసము. యెంత గొప్పగానున్నది పద్యము. విష్ణు కర వైభము! చెప్పుటకు వీలులేదు.
పోతన వర్ణనా సామర్ధ్యమునకాతని వచనములే నిదర్శనము. భాగవతమునందలి పద్యములన్నియు వెలగట్టలేని మణులు. యింక నందలి బాలకృష్ణుని లీలలు, ప్రహ్లాదచరిత్రము, వామనావతారము, గజేంద్రమోక్షణము మొన్నగు వివిధఘట్టములు వెలగొనలేనిఃదివ్య మణిమయ హారములు. మందార మకరంద ధారాసిక్త మైన భావములతో ప్రతి పద్యమొక నూజివీడు చెఱకు రసాల మామిడి పండువలె సంతసముతోనింపి తుష్ఠిని పుష్ఠి ని పాఠకునకు గలుఁగఁజేయును ;
ఇట్లు భావత రచనతో నాంధ్ర సాహిత్యమునుఃపరిపుష్ట మొనరించిన పోతనతాను ధన్యుఁడగుటయేగాక నాంధ్రుల కందరకు ధన్యత్వ మందజేసి తరించి మనలను తరింపఁ జేసినాడనుట యదార్ధము.
ఉ: ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులన్ బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెఱ పోతరాజొకడు భాగవతంబు జగధ్ధితంబుగన్;
స్వస్తిర్భవతు !

Monday, 6 July 2015

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు - నన్నెచోడుఁడు

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు
నన్నెచోడుఁడు 


కం:- కలుపొన్నవిరులు పెరుగన్
గల కోడిరవంబు దిసలఁ గొనగొని మొరయన్
బొలియు నొరయూరికధిపతి
నలఘు పరాక్రముఁడఁ డేంకణాదిత్యుండన్ !
నన్నెచోడ కవిరాజ శిఖామణి " కుమార సంభవ కావ్య నిర్మాత. ఒరయూరి కధిపతి. టేంకణాదిత్య బిరుదాంకితుఁడు .ఈచోళరాజులు కడప మండలమును బరిపాలించి నట్లు చరిత్ర కారుల కధనం. తాటియాకుల కవిలెలలో నెక్కడో యడుగున బడియున్న యితని గ్రంధమును వెదకి సంస్కరంచి తొలుత ప్రచురించిన వారు కీర్తిశేషులు మానవిల్లి రామకృష్ణ కవిగారు. వారీ గ్రంధ ప్రచురణ తోబాటు పెద్ద దుమారమును లేపిరి. అది " నన్నెచోడుడు నన్నయకు ముందువాడని , ఆదికవిబిరుదమునకు యితడే అర్హుడని వారివాదము. 1దేసికవితావిధానము 2 శాసనములలో నితని తలిదండ్రుల పేర్లు నన్నయ్యకు ముందుకాలమున నుండుట. కారణములుగా బేర్కొనినారు. వాఙ్మయ పరిశోధకులు ఆవాదమున పసలేమి. దొరికిన యాధారములమేరకు యితనిని నన్నయ- తిక్కల నడిమి కాలము వాఁడుగా నిర్ణయించినారు. కానిండు దానితో మనకిపుడు పనిలేదు.
కం:- మార్గమె మార్గము దేసి య
మార్గము వదలంగ దమకు మతి వదలక దు
ర్మార్గ పథవర్తు లనఁదగు
మార్గ కవులఁదలప మహి సుకవులకున్;
తెలుగు కవిత్వము మార్గము, దేసి యని రెండు రీతుల నన్నయ నాట విభజింపఁబడినది. సంస్కృత ఛందో సాంప్ర దాయము ననుసరించి తత్సమ పద ప్రాచుర్యముగా రచనజేసిన నది మార్గ కవిత్వము. అటుగాక తద్భవ, దేశ్య పద జాలముతో, దేసిఛందమునకుఁజెందిన తరువోజ, అక్కర, సీస, కంద, గీతము,ఃఆటవెలది, ద్విపద, లతో కవత్వమును కొనసాగించిన నది దేసి కవిత్వము.
నన్నయ నాడు మార్గ కవులు విస్తారముగా నున్నారు. వారు దేసికవుల నీసడించెడి వారట! దేసి పామర కవిత్వ మనెడివారట! పైపద్య మట్టి దేసికవుల నిరసనమునకు ప్రతిరూపమైనిలచినది. దేసిని గౌరవించినరాజులుఁగూడలేకపోలేదు.
కం:- మును మార్గకవిత దేశం
బున వెలయగ దేసికవిత బుట్టించి దెనుం
గును నిల్పి రంధ్ర విషయంయం
బున, సత్యాశ్రయుని దొట్టి చాళుక్య నృపుల్:;
సత్యశ్రయుఁడను చాళుక్యరాజు తనకాలంలో దేసికి గౌరవ మొసగి తెలుగు దేశంలో వెలయఁజేసెనట. యింతకు నన్నెచోడుడు " దేసి కవితాభిమాని" శివకవుల వర్గమునకు జెందినవాడు. యితడు12 ఆశ్వాసముల పరిమితిగల విస్తారమైన కథతోకూడిన కుమార సంభవమను మహా గ్రంధ మును రచియించెను. దానిని తనగురువు జంగమ మల్లి కార్జనునకు అంకితము గావిచెను.
కుమారసంభము కాళిదాస కుమార సంభవమును, శివపురాణమును అనుసరించుచు గ్రధనముఁజేసెను. సతిజన్మము తో నారంభమైయిది తారకాసుర సంహారముతో ముగింపు నకు వచ్చినది. యిందీతడు దేసికవితను విరివిగా నుపయోగించెను. కానీ మార్గ కవితా సాంప్రదాయములను అనుసరింపక తప్పలేదు. స్రగ్ధర, చంపక, ఉత్పల, తరళము, మత్తకోకిల, మత్తేభము, శార్దూలము, యిత్యాది వృత్తములను వాడక తప్పలేదు. అయినను మనము గమనింప వలసినది " యితనిది దేసికవితా మార్గమని" యితనిదేసికవిత కొకయుదాహరణము
ఉ: పొన్నలు పూసె; పొన్నలొగి పూవక ముందరె పూసెగోగు; లా
పొన్నలు కొండగోగులును పూవకముందరె పూచె బూరుగుల్,
పొన్నలు కొండగోగులును బూరుగు లున్నొగి పూయకుండగా
మున్నె, వనంబునన్ గలయ మోదుగ లొప్పుగఁబూచె నామనిన్;
భావం: వసంత వర్ణనం లోనిదీపద్యం . ఆఋతువులో యేయే పుష్పాలు ముందువెనుకలుగా పూస్తాయో వివరించటమే పద్యంలో వున్న విషయం. కవిపూచేపూవుల క్రమాన్ని అపక్రమంగా చిప్పటం యిందలి నవీనత! వసంతం వస్తోందంటే ముందుగా మోదుగలు, తరువాత బూరుగలు, ఆపై కొండగోగులు ,చివరకు పొన్నలు పూలు పూస్తాయి. అదిక్రమం. అదియిక్కడ వ్యత్యస్త మైంది.
ఇందులో యించుమించు అన్నీ తెలుగు పదాలనే వాడటం గమనీయం! ఇదిగో యిది
దేసికవితా విధానం. దీనికి ఆద్యుఁడు నన్నెచోడ కవిశిఖామణి ; యితని కవితావిధానం దేసి. స్వస్తి!

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు - కవి బ్రహ్మ తిక్కన సోమయాజి

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు
కవి బ్రహ్మ తిక్కన సోమయాజి
మ: అమలో దాత్త మనీష, నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శి
స్పమునన్ బారగుఁడన్, గళావిదుఁడ ,నాపస్తంభ సూత్రుండ, గౌ
తమ గోత్రుండ , మహేశ్వరాంఘ్రి యుగళీ ధ్యానైక శీలుండ న
న్నమకున్ కొమ్మన మంత్రికిన్ సుతుఁడ సన్మాన్యుండఁ దిక్కాఖ్యుఁడన్
;
అవతారిక- నిర్వచ నోత్తర రామాయణము;
కవిత్రయంలో ద్వితీయుఁడైన తిక్కన తనృకవితా రీతులను గూర్చి యిదమిథ్థముగా నెక్కడను బేర్కొనియుండలేదు. అయినను పైపద్యమును బట్టి యతని కవితారీతులను విగడించుటకు అవకాశము
లభించుచున్నది. ఇదియే గాక పలువురు వాఙ్మయ పరిశోధకులు పేర్కన్న రీతులు తిక్కన కవిత్వ పధ్ధతుల నెఱుంగుటకు వీలుఁగల్పించుచున్నవి. వీటియన్నిటి సారాంశములను దిక్ ప్రదర్శనముగా వించుటకు బ్రయత్నించెదనుగాక!
అమలోదాత్త మనీషచే , ఉభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునందు నేర్పరియట .మనీషయనగా బుధ్ధివిశేషము. అది అమలము- స్వఛ్ఛము, ఉదాత్తము- ఉత్తమమును అయినది ; అట్టిమనీషచే నుభ య కావ్య ప్రౌఢిని బరికింపగల శిల్పమునందు పారగుఁడు - అనగాచక్కని బుధ్ధిబలముచే సంస్కృతాంధ్ర కావ్యములను నిర్మింపగల శిల్పమున నారి తేరినవాడట! కళావిదుడ- కళలస్వరూపమును దెలిసినవాడట.
ఇట బేర్కొనిన ' శిల్పము' కళ' ఈరెంటిని మిగులజాగరూకతతో బరిశీలింపవలసి యున్నది. శిల్పమనగా నైపుణ్యము. కళ యనగా నందము దానివలన గలుగునది యానందము; యేతావాతా తేలినదిది. నేను సంస్కృతాంధ్ర భాషలలో నందముగా కావ్యనులను నిర్మింప దక్షుఁడననుట! ఆవిెషయము మనకు నీక్రింది శ్లోక , పద్యములు నిరూపించు చున్నవి .
స్రగ్ధ: శ్రీ రాస్తామ్ మనమ క్షితీశ్వర భుజాదండే జగన్మండలే;
ప్రాసాద స్ధిర భార భాజి దధతాం సా సాలభంజీ శ్రియాం
శుండాలోత్తమ గండభిత్తిషు మదవ్యాసంగవస్త్యాత్మనామ్
యాముత్తేజయతేతరాం మధులిహా మానంద సాంద్ర స్థితిః;
మనుమ సిధ్ధి భుజాస్తంభములను ప్రాసాద మునందు అలంకరణార్ధమై యుంచ బడిన సాలభంజికవలె రాజ్య లక్ష్మి స్థిర నివాసమున్నదట! మదగజముల గండస్థలముల యందలి మదజల ధారకాసపడి వచ్చి యచటనే నివాసమున్న గండుతుమ్మెద లన్నియు నుత్తేజమును గల్పింపగా రాజ్య లక్ష్మి వసించెనని తాత్పర్యము. " ఆగజాంత మైశ్వర్యం" అనునది యొక సంస్కృత సూచనము. లోకమున పెక్కు యేనుఁగు లున్నవానినే ధనవంతునిగాబరిగణించెడివారట ! మనుమ సిధ్ధి మహదైశ్వర్య వంతుఁడని యతనిగజబలమే నిరూపించు చున్నదని తాత్పర్యము. మహాబలవంతుఁడని మరోయర్ధము. అందుచేతనే యతనియింట రాజ్య రమ స్ధిర నివాసము నేర్పరచు కొనెనని ఫఎలితార్ధము. ఇది నర్వచనోత్తర రామాయణ ప్రారంభశ్లోకము; ఇదియతని సంస్కృత కవితాప్రౌఢతకు నిదర్శనము;
ఉ: శ్రీయన గౌరినాఁబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయత మూర్తియై హరిహరంబగు రూపముఁదాల్చి విష్ణురూ
పాయ! నమఃశివాయ! యని మ్రొక్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పర తత్వముఁ గొల్తు నభీష్ఠ సిధ్ధికిన్;
ఇది విరాట పర్వారంభ పద్యము. అనగా తిక్కన భారతాంధ్రీకరణమున దొలిపద్య మన్నమాట; తిక్కన హరిహరనాధ భక్తుఁడు. శివకేశవాద్వైతవాది. యందుచేతనే తన బారత భాగమునకు కృతిపతియగు హరిహరనాధుని తొలిపద్యమున వర్ణిచినాడు. ఇందు శ్రీదేవికి గౌరికి యభేదము, హరికి హరునకు అభేదము చెప్పబడినది. శ్రీయనియు గూరియనియు చెప్పబడు చెలువకు హృదము పల్లవింపగా , హరి హరూపముతో
శుభంకరమైన రూపమును ధరించి " విష్ణురూపాయ నమశ్శివాయ! యని నమస్కరించు నిజభక్తగణముల వైదిక ధ్యానముల కెదమెచ్చు పరదైవతమగు హరిహరనాధుని యభీష్ఠ సిధ్ధికై సేవింతును. అని దీనియర్ధము.
ఈరెండు పద్యముల బరిశీలనతో నీతని యుభయ కావ్యప్రౌడ రచనారీతి యెరుక పడినదిగదా! అనగా సంస్కృత కావ్యమైనను తెలుగు కావ్యమైనను నిరాటంకముగా రాయగల ప్రౌఢత యతని స్వమతమన్నమాట!
మ: హృదయా హ్లాది చతుర్ధ ,మూర్జిత కధోపేతంబు నానా రసా
భ్యుదయోల్లాసి, విరాట పర్వ మట, యుద్యోగాదులం గూడగా
బదునేడింటఁ దెనుంగుఁ జేసెద
 - నని విరాట పర్వారంభంలో తిక్తన గారికథనము. ఇందుమనకు"నానారసాభ్యుదయోల్లాసి"యను భాగము అవసర పడి యున్నది; విరాట పర్వము పెక్కురసముల కు కూడలి యనిదీనివలన దేలుచున్నది. రసపోషణమున దిక్కనకు సాటి రాదగిన కవియరుదు. రసపోషణమీతని కవితా గుణములలో3వ స్థానము నాక్ర మించుచున్నది. 4 నాటకీయత 5వది తెలుఁగు నుడికారము.
భారతమున విశేష భాగమును దిక్కన యనువదించెను దాదాపుగా నవరసములను నతడు పోషించు రచనము నొనర్చినాడు. ప్ర ప్రధమగు విరాట పర్వము ననుసరించి యాతని రస పోషణా సామర్ధయమును బరిశీలింతముగాక! విరాట పర్వమున కీచక సైరంధ్రుల కృతక ప్రణయ ఘట్టమున శృంగారమును( ఆభాసమే గానోపునుగాక) ఉత్తరుని మాటల సందర్భమున హాస్యము. కీచక- భీమసేనుల యుధ్ధ సందర్భమున వీర, రౌద్ర, భయానక, భీభత్స రసములు యితనిచే ననుపమానముగ బోషింపఁ బడినవి. ధర్మజుని(కంకుభట్టు) చేతలలో మాటలలో శాంతము . యిట్లు వివిధ సందర్భ ముల కనుగుణముగా రసపోషణము గావింపఁబడినది . ఉత్తర గోగ్రహణ సందర్భంలో భీతుఁడయిన యుత్తరుఁడుబృహన్నలతో,-
శా: భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే జేరంగ శక్తుండనే!
అనే ఈ పద్యంలో వీర ,భయానక ,అద్భుత రసములను సముచితముగాఁ బోషింపఁబడినవి. రసాను గుణ్యమగు ఆరభటీ వృత్తియు, సుదీర్ఘ సమాసములు, దుష్కర ప్రాసము, సంస్కృత పదాడంబరము; తిక్కన రసపోణకుపక రించిన పరికరములు . కవి సార్వ భౌమ శ్రీనాధుఁడు" వాకృత్తు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు" ఒక్క శ్రీనాధునకేగాదు ఆగామి కవితల్లజుల కెల్లరకు రస పోషణమునకు దారులు దీర్చినది తిక్కనయే ననుట నిస్సందేహము!
నాటకీయత:- తిక్కన కళావిదుఁడుగదా! నాటకీయత కళలో నంతర్భాగమే! లలిత కళలో నాట్య మొకటి. నటయోర్భావమ్ నాట్యమ్!ఃకావున ప్రత్యేకముగా చెప్పవలసిన యక్కర లేకున్నను వాఙ్మయ విమర్శకులెల్లరు దీనిని ప్రత్యేకముగా ఁబేర్కొను చుండుటచే దీనినిక్కడ బ్రస్తావింపకఁ దప్పలేదు. కావ్యము, శ్రవ్యము. నాటకము దృశ్యము. అట్టిదృశ్య స్వభావమును కావ్యమున కాపాదించుట నాటకీయత! భారతము శ్రవ్యమే యైనను దృశ్యము వలె నానంద సంధాయకములగుటచే నిది సిధ్ధింప జేయుటనే మనవారు నాటకీయతగాఁజెప్పుచున్నారు. తిక్కన భాతమున నది పుష్కలము. తిక్కన రచన శ్రవ్యమువలెననిపంచదు. భావుకుఁడగు పాఠకున కది దృశ్య ప్రబంధముం దలపించును. కీచకుని బెదిరించుచు సైరంధ్రి-
శా:-
దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్
గర్వాంధ్య ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్,
గీర్వాణాకృతు లేవురిప్డు నిను లీలం వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం దొనుట తధ్యం బెమ్మెయిన్ కీచకా!
- అంటోంది. ఈపద్యం
అచ్చు నాటక పద్యాన్ని దలపించుట లేదా! కనులు మూసి హృదయ క్షేత్రంలో గనిపించే యస్త్రీ మూర్తిని జూడుడు; యికనిట్టివి యిందు కోకొల్లలు.
తిక్కన నాటకీయత 
చ: వరమునఁబుట్టితిన్ భరత వంశముఁజొచ్చితి, నందు పాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁబొందితి , నీతి విక్రమ
స్థిరులగుఁ బుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపుఁ గాంచితిన్;
సరసిజనాభ! యిన్నిటఁ, బ్రసిధ్ధికి నెక్కిన దాన నెంతయున్
;
ఉ: నీవు సుభద్ర కంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేతు, వట్టి నను, పంకజనాభ! యొకండు రాజసూ
యావ బృధంబునందు, శుచియై పెను పొందిన వేణిఁబట్టి యీ
యేవురు జూడగా, సభకు నీడ్చె, కులాంగన నిట్లొనర్తురే!
కౌరవ సభకు కృష్ణుడు రాయబారిగాఁ బోవు సందర్భమున ద్రౌపది పల్కిన మాటలు. రెండు పద్యములు తెరపై పాత్ర హావ భావములనుబ్రదర్శిమచుచు బల్కినట్లు లేవా! ఆఘట్టమేగాక, కౌరవ సభలో కృష్ణుని రాయబార ఘట్టమును, తిక్కన నాటకీయతకు నిలువు టద్దములు. వాకోవాక్యనిర్మాణము. పాత్రలయాహార్యము యిట్లుగా యొకటన నేల యన్నియు నాటకీయతను బోషించినవి.
5 నుడికారము:- నుడి కారమనగా భాషలోని సొగసులు. పలుకు బడులు. ఆంగ్లమున(దీనినే యిడియ మాటిక్ గాచెప్పుచందురు. ప్రతి భాషకు నొకపధ్ధతియుండును. వాక్య నిర్మాణమున, క్రియాప్రయోగమున, సామెతలు వాడుసందర్భమున , లోకోక్తులనుపయోగించురీతిలో నొక ప్రత్యేకత గోచరించుచుండును. దానినే మనవారు నుడికారముగాఁ బోర్కొను చున్నారు .
చ: పగ యడగించు టెంతయు శుభం , బదిలెస్స, యడంగునే పగన్
పగ వగగొన్న మార్కొనక యుండగ వచ్చునె? యేరికైన, నే
మిగతి దలంచినన్ బగకు మేలిమి లేమి ధృవంబు కేశవా!
పాఠకులు క్షమించాలి . మధ్యలో నొక పాదము లుప్త మైనది. పుస్తకము లేమి మస్తకమును నమ్మకొంటిని. వార్ధక్యము వంకతో నదినన్ను వచించినది. పోనిండు మనవిశ్లేషణ కిది సరిపోవును. పైపద్యమలో శుభంబు, ధృవంబు, దక్క తక్కిన పదములన్నియు తెలుగు పదములే! చెప్పువిధానమును గమనించితిరా, తెలుగునాట ప్రతియింట నిట్టులనే సంభాషణ సాగుచుండునుగదా! తిక్కన తెలుఁగుఁదనమునకు పెద్ద పీట వేయును . యితని కవితలో తత్సమ పదప్రయోగము అతి విరళము. చెప్పువిధానము, సామెతల నామెతలుగా వాడుట, వాకోవాక్య నిర్మాణము మొన్నగునవి తెలుఁగుఁ దనమునకు మిక్కిలి దగ్గర గానుండును. యిది తిక్కన తెలుఁగు నుడికారము.
కంద పద్య రచన:- యీకవిని పరిచయము చేయు సందర్భమున దీనిని మరువ రాదు. యిది శిల్పమున నొకభాగమగుట దీనినొక ప్రత్యేక లక్షణముగాఁ బేర్కొనుటలేదు.
ముందుగఁజను దినములలో
కందమునకు సోమయాజి ఘనుండందురు - అని కవిచౌడప్ప తిక్కనను కంద పద్యరచన లో మొనగాఁడని ప్రశంసించినాడు. యదార్ధమే! కంద పద్య రచనలో తిక్కనమేటి. యతని కందములలో నొకవిలక్షణత యున్నది." అల్పాక్షరములలో ననల్పార్ధరచనమే కవిత్వము" అని శివకవుల యభిప్రాయము. తిక్కన యాసూత్రమును మన్నించెను . అందుకు సాధనముగా కందమును గ్రహించెను. కొండంత భావమును చిన్న కందములో నిమిడ్చి చెప్పు చాతుర్యము తిక్కన స్వభావము.
కం:- ఆపదఁ గడవం బెట్టఁగ
నోపి, శుభంబైన దాని నొడఁగూర్పను , మా
కీపుట్టువునకు పాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపిఁ జనియె మహత్మా!
భారతోద్యోగ పర్వమున కృష్ణుఁడు కౌరవ సభకు రాయబారియై పోవు సందర్భమున ధర్మరాజు కృష్ణుని నన్నమాటల లోనిదీ పద్యము. ధర్మజుఁడు తనమనస్సులోని విషయమంతయు వ్యంగ్యముగా నీపద్యమున సూచించినాడు. మొదటి సంబోధననే పరికింపుఁఢు. మహాత్మా! తోనారంభము.నీవుమహాత్ముఁడవు నీకు చెప్పవలసిన పనియేమి? సర్వము నీవెరుంగుదువు. మేముపడిన కష్టములు నష్టములు పరాభవములను నీకు వివరింపఁబనిలేదు. తండ్రి లేనిపిల్లము. మాకు దిక్కుదేవుడే ఆదేవాది దేవుఁడవగు నీకు చెప్పునదేమి? యైనను నీయొక్కమాట వినుము. మాయాపదలెల్లఁదొలగించి శుభము నొడఁగూర్పగా మాకీజన్మమునకు పాండురాజు మాతండ్రి నిన్ను పెద్దదిక్కుగాఁజూపించెను. యికనీదేభారము.
ధర్మజుని మాటల లోదాగిన మర్మ మిది; కౌరవ, పాండవులలో నేను పెద్ద వాఁడను రాజ్యాధికారము నాదేగదా! కావున యోచించి నన్ను చక్రవర్తిగా చేయుటయే నీకు ధర్మము. అదియే ధర్మ సంస్థాపనము. పరదైవతమవు గావున మావిషమున కడుంగడు జాగరూకత తో వ్యవహారమును జక్తఁబెట్టుము. నీదేభారము. యిన్నివిషయాలు యీచిన్ని కందంలో నిమిడ్చి తిక్కన తనరచనా శిల్పమును యనల్పమైనదానినిగా వెలయింపఁజేసెను . మొత్తముమీద 1.ఉభయకావ్యప్రౌఢి, 2 శిల్పము, 3 కళావేతృత్వము,
4. నాటకీయత, 5 తెలుఁగు నుడికారములు తిక్కన కవితా లక్షణముగా బేర్కొనుట జరిగినది,. స్వస్తి!

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు - నన్నయ్య భట్టు కవితా విధానము

మిత్రులకు శుభోదయం!
మిత్రులారా! ఆంధ్ర సాహిత్య క్షేత్రం లో పసిడి పంటలను పండించిన కవులు అసంఖ్యాకం . వారిది ఒక్కొక్కరిది ఒక్కొక బాణి ఒక్కొక్క వాణి . ఆవిధానం వారి కవతలకు యెట్లు వన్నెను వాసిని సమకూర్చినదో మనము తెలిసి కొందము. నన్నయ మొదలు నారాయణ రెడ్డి వరకు ఒక్కొక్కరిగా సంక్షేపముగా పరిశీలింతము . ముందుగా ఆదికవి నన్నయ భట్టారకుని తో ప్రారంభింతము.
నన్నయ్య భట్టు కవితా విధానము 

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్ధయుక్తి లో
నారసి మేలునా , నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్ధ సూక్తి నిధి, నన్నయభట్టుఁ దెనుంగునన్, మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె, జగధ్ధితంబుగన్;
నన్నయ భట్టుగా ప్సిధ్ధినందిన నేను భారత సంహితను(వేదమును) రచియించుటకు దీక్షవహించు చున్నాడను. సంస్కృత మందలి భారతమును దెనిగించుటకు నేనుయెన్నుకొన్న విధానమిది.
1 సారమతులైన కవీశ్వరులు ప్రసన్నమైన (ప్రసాదగుణముతోగూడిన సరళమైన) కధార్ధ విధానమును హృదయములయందు పర్యాలోచనమొనరించి మేలుృమేలని ప్రశంసింపగా, భారతమునుతెనిగిస్తున్నానని చెప్పాడు.అయితే లోనారయుటకు వారు సారమతులై యుండాలట! మనకిపుడు సారా మతులేగాని ( ఈమాట నాదికాదు విశ్వ నాధది) సార మతులెక్కడ? వారు లోనారయుటకు ఈలోచనాలు పనకిరావు. సులోచనాలు కూడా వృధాయే! దానికిఆలోచనా లోచనాలనుదెరవాలి. మనస్సులో ఆకధావిధానాన్ని అవలోకించాలి. అదిగో అప్పుడు బోధపడుతుంది అతని కథాకథన విధానం . నన్నయ భారతాన్ని యధామాతృకగా ననువదింపలేదు. కమ్మని కథవింటున్నట్లు మనంభావిచే రీతిగా అనువాదం సాగించాడు. కథాకథనానికి అడ్డం వచ్చే వర్ణనలను తగ్గించాడు. కథవినే పాఠకులకు విసుగు రాని పధ్ధతియది. సుదీర్ఘములైన సంభాషణలను కుదించినాడు. శిశుపాల వధలోనియీపద్యమును పరిశీలించండి .
చ: ఇతనికిఁగూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక! మహాత్ములైన భూ
పతులయు విప్ర ముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁడని యచ్యుతు నర్చితుఁజేయ బాడియే!
మూలం లోని దీర్ఘ తరమైన సంభాషణను తగ్గించాడు. ఇదీ యతనికథాకథన విధానం. దీనినే ప్రసన్న కథ గాఁబేర్కొని నాడు.
2 అక్షర రమ్యత - అందంగా అక్షరాలువనిపించటం ( శ్రవణ శుభగంగా) పండితులు కవులు, ప్రసన్న కధని మెచ్చగా,యితరులు- అంటేసామాన్యులు. కొందరు పామరులు అని వింగడించినారు అది తప్పు. అక్షరజ్ఙానమున్నవాడు పామరుఁడెట్లగును? అందుచేత రెండవ వర్గము వారిని సామాన్యులు గనే చెప్ప వలసి యున్నది. వారెల్లరు అక్షర రమ్యతను ఆదరింపగా భారతమును రచించెనట! ఈయక్షర రమ్యత యమకాది శబ్దాలంకారములచే సాధింప వచ్చును. అదేపని చేసినాడు. ఈపద్యమును బరికింపుడు.
చ: రయ వితలత్తురంగమ తరంగములన్ , మదనక్ర నాగ సం
చయముల సంచలచ్చెటుల సైనిక మత్స్యములన్ భయంకరం
బయి యదు వృష్ణి భోజ కుకు రాంధక వాహినియుం గలంగె ని
ర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబు నన్ ;
రాజసూయాధ్వర సందర్భమున కృష్ణుని పూజించి నందుకు అలిగిన శిశుపాలుఁడు యుధ్ధమునకు తెగపడెను . అతనిని సమర్ధించువారు ( రాజులు) యుధ్ధమునకు తయారైనారు. ఆసంరంభమును ఈపద్యము వివరించు చున్నది. ఒకరా యిద్దరా ,యదు వృష్ణి భోజ కుకుర అంధక దేశములకు జెందినరాజులు వారిమహాసైన్యము . అది యొక పెద్ద సాగరమును దలపించు చున్నది. సారమైతే తరంగాలండాలికదా! యిక్కడ యెగిరెగిరి పడే గుఱ్ఱాలే తరంగాలట! పెద్ద చాపలుండాలికదా! అటునిటు పరుగులుఁదీసే సైనికులే మత్స్యములట! భయంకరమగుట సైన్య సముద్రములకు సమము. ఆసేనాసముద్రం దయారాహిత్య మనే పెనుగాలులకు చెలరేగి పోతున్నదట! అంటే అల్ల కల్లోలంగామారిదని తాత్పర్యం!
ఈసంరంభాన్నంతా ఈవిధంగా పదాడంబరంతో నింపి యాపై రూపకము ఆరోపించి దీనినీ చదువు పాఠకుల మనంబుల కబ్బుపాటొదవించెను. ఇదీయక్షర రమ్యత వలన నన్నయకు గలిగిన ప్రయోజనము. కావున నన్నయ కవితా గుణములు 1 ప్రసన్నకధ 2 అక్షర రమ్యతలు . లనుట. యుక్తము.

Monday, 29 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 52

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

మ: కవితల్ సెప్పినఁ బాడ నేర్చిన వృధా కష్టంబె, యీభోగపుం
జవరాండ్రేగద, భాగ్య శాలినులు! పుంస్త్వంబేల పో పోచకా?
సవరంగా సొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టింతువే
నెవరుల్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే! పాపపుం దైవమా!
వేశ్యల విషయంలో శ్రీనాధుని యిప్పటి మాట యిది. వెనుక రాజాదరణము లభించినంత వరకు తానుగూడ నా వేశ్యాలంపటమున జిక్కిన వాఁడేగద! నేడు కవులకు ఆదరణ ముతగ్గినది. చిత్రము! వేశ్యలకు మాత్రము సంఘమున గలిగిన యాదరణము తగ్గకపోగా పెరిగినది. అదిశరీరముతో వ్యాపార మాయె, భోగ పరాయణు లున్నంత కాలము వారి యాదరణకు కరువుండదు. ఈసత్యము నానాడే గురుతించిన నెట్లుండెడిది? ధనమునకు కొదువ యుండెడిది గాదు. రారాజులు కోరినంత ధనము నిచ్చిరి. తానేమి యొనరించెను? జీవనదాహమునుదీర్చుకొనెను. భోగమునకు, భోజనమునకు, మిలినది దానధర్మములకు, యిప్పుడు రిక్త హస్తుఁడయ్యెను. ఇక జీవనమెట్లు? రెడ్డి రాజులు కాలగర్భమున గలసిపోయిరి. ఒడ్డెరాజులా పరభాషీయులు. వారికి కవులపై సదభిప్రాయము శూన్యము. పైపెచ్చు కవులు సంఘమును పీడించుకొని బ్రతుకు సోమరి పోతులని వారి యభిప్రాయము. తిప్పయసెట్టి వ్యాపార మడుగంటినది. యిక దారి యేది? శ్రీనాధునిలో పరివేదన మారంభమైనది.
వేరు మార్గము లేక వ్యవసాయమునకు గడంగెను. మరి భూమేది? అదియును లేదు. రెడ్డిరాజులకాలమున నడిగిన వారికి యగ్రహారములిచ్చిరి. అహ మడ్డపడినది. అడుగలేక పోయినాడు. మరినేడు తన మనుగడకు భూమి యవసరము గదా ఒడ్డెరాజులకడ గుత్తకు దీసికొనకఁదప్పలేదు. కృష్ణాృనదీ తీరమున గల బొడ్డు పల్లె యను గ్రామ మున కొంత భూమినిఃకౌలునకు సంపాదించెను. వ్యవసాయమునకు పెట్టబడి? అదియుఋణమే! " బాపన యెగసాయం పల్లకీల మోత" అని మాచిన్నట పల్లెలలో వెక్కిరించెడు వారు. బ్రాహ్మణులు స్వతః కష్టజీవులుకామి, శ్రామికులపైనాధార పడక తప్పదు . వారి యనుగ్రహము మనప్రాప్తము. అంతే వేరులేదు. దీనికిఁదోడు చీడ పీడలు , వానలు వరదలు, పక్షులబాధ, మిడతల స్వైరవిహారములు,, ఈరీతిగా పలు కష్టముల నెదుర్కొనక తప్పదు. ఇక్కడ నదే జరిగినది. వరదలవలన పల్లపు పంటలు పోగా, పక్షులదాడివలన మెట్టపంటలు నాశము నొందినవి. మిగిలినది. కష్టములు, కనినీళ్ళు.
వ్యవ సాయముగూడ శ్రీనాధుని ఋణభారమును పెంచెనేగాని యూరట గలిగింప లేదు. ఇటు ప్రభుత్వము వారికిఁ జెల్లింప వలసిన సిస్తు పెరిగి పోయినది. దారిగానక పాపమా కవిసార్వ భౌముఁడు దీనాతి దీనముగా పరితపించినాడు.
సీ: కాశికా విశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
రత్నాంబరమ్ము లేరాయఁడిచ్చు;
రంభఁ గూడెఁ దెనుంగు రాయ రాహుత్తండు
కస్తూరి కేరాజు బ్రస్తు తింతు ;
స్వర్గస్తుఁడయ్యె విస్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిఁగలుగు;
కైలాస గిరిపండె మైలారు విభుఁడేగి
దినవెచ్చమేరాజుఁదీర్పఁగలడు
; _ ఇలా సాగిపోతున్నాయి మనస్సులో వేదనల గాధలు,. నేను చేసినదేమి వ్యవ సాయము అదియును మోసగించెనే చేయునదేమున్నది? ప్రభుత్వమునకు ముందు చేతులుఃజోడింప వలసినదే! పాపమాతడదే యొనరించెను. కరుణలేని రాజాధికారులు కఠినాతి కఠినముగా శిక్షాస్మృతి నమలుజరిపినారు.
సీ; కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా!
పురవీధి నెదురెండ పొగడ దండ;
యాంధ్ర నైషధ కర్త యంఘ్రి యుగ్మంబున
దగిలి యుండెనుగదా నిగళ యుగము;
వీరభద్రా రెడ్డి విద్వాంసు ముం జేత
వియ్య మందెనుగదా! వెదురు గొడియ;
సార్వ భౌముని భుజా స్తంభ మెక్కెనుగదా!
నగరి వాకిట నుండు నల్ల గుండు;
తే: కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము ,
బిల బిలాక్షులుఁ దినిపోయెఁ దిలలు పెసలు,
బొడ్డు పల్లిని గొడ్డేఱి మోసపోతి ,
నెట్టు చెల్లింతుఁ డంకంబు లేడు నూర్లు?
అనుకున్నంత యైనది. పురవీధిలో యెండకెదుగా నిలబెట్టి మెడలో పొగడ దండ( బండ కొయ్య) తగిలిచినారు. కాళ్ళకు సంకెళ్ళు దగిలంచినారు. చేతులకు వెదురు గొడియలు బిగించినారు. మెడపై పెద్ద నల్లని గుండు( పెద్ద పరిమాణముగలరాయి) నెక్కిచినారు. పురవీధుల లోనడిపించినారు. యితచేయు చున్నను శిక్షల పధ్ధతులనుమాత్రము వర్ణించుట మానలేదు. ఆకవిస్వభావమది! వేరెవరైనా రక్షించువారున్నారా?
తే: భాస్కరుఁడు మున్నె దేవుని పాలికరిగె ; అయిపోయినది యిక నేయాసయులేదు.
కలి యుగంబున నిక నుండఁ గష్ట మనుచు ,
" దివిజ కవివరు గుండియల్ డిగ్గురనగ,
నరుగు చున్నాడు శ్రీనాధుఁ డమర పురికి!"
ఆహా! మరణ వేళల యందును యెంత రాజసము! నిట్టి కవి నెన్నఁడైనఁ జూచినారా? శ్రీనాధుఁడొక్కఁడే చరిత్ర కెక్కినాడుగదా! కవి సార్వభౌముని జీవన ప్ర స్థాన మీరీతిని ముగిసినది. యిది యెల్లరకు గుణపాఠమే! మానవుఁడు కోరవలసినదిది" అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం/ దేహాంతే తవసాయుజ్యం దేహి జన్మని జన్మని",_ యని దానిని మరచి శ్రీనాధుఁడిహ సుఖములకే ప్రాధాన్య మొసగి, యిక్కటుల పాలైనాడు. ముందు చూపు లోపించి ధనమంతయు వ్యయ పరచినాడు . యిట్టి పొరపాటులకు శిక్ష తప్పదు. కోరికల నరికట్టి మిత హిత జీవనుఁడై మనుగడ సాగించుట మానవ కర్తవ్యమనుట. శ్రీనాధకవి జీవన ప్ర స్థాన సందేశము.
ఇంత వరకు నాసాహిత్య ప్రయాణము తోడునడచి, నన్ను బహుధా ప్రోత్సహించిన సాహితీ బంధువులకు, మిత్రులకు నాకృతజ్ఙతాంజలులు! సెలవు.
జయంతి తేసుకృతినో రస సిధ్ధాః వీశ్వరాః 
నాస్తి యేషాం యశః కాయో జరామరణజం భయమ్!!

స్వస్తి ర్భవతు!

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 51

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

బాల చంద్రుఁడొనర్చిన సంకుల సమరము 
మంజరీ ద్విపద :- " అటమున్నె నరసంహుఁ డధిక బలంబు
తెచ్చుక మొనజేసి ధీరత నెదుట
మద గజంబుల పైకి మత్త సింహంబు
అరుదెంచు విధమున నాశ్చర్యలీల
ఫౌజుపై నడచిరి' బాలురార్వురును .
వసుధేశు తమ్ముఁడు వారలఁ జూచి,
తనవారి కెల్లను తా సైగ జేసె;
బ్రమ్మిరి విలుకాండ్రు ఘనులపై నపుడు
బాలుఁడు మొదలైన బాలవీరులును
నారుల విండ్లను నలి నలి జేసి
తొనలును బాణముల్ తునుకలు సేయ
వెరువక యుండిరి. వీరుల పైకి
కదిసి మూకలువచ్చి కదన మధ్యమున
సాంద్ర వంశాటవీ చందము దోప ,
సిమ్మిరి సాధ్వస కరముగ నపుడు.
తలకక వారలు ధైర్యంబు నొంది
చే గదల్ ద్రిప్పుచు చెలగి యార్చుచును,
కొక్కెర గుంపుపై కుప్పించి యురకి
సాల్వంబు ఢీకొన్న చందము గాగ,
కరులపై సింహంబు గదిసిన రీతి,
వ్యాఘ్రంబు గోవుల వడి దాకునట్లు ,
సేనల జెండాడి చేతుల మెడల,
ఘ ఘనమైన కత్తుల ఖండించి మించె;
________________________
ఘనుఁడైన శ్రీనాధ కవి రాజరాజు
చెన్నుని కృప చేత చిత్తము ప్పొంగి,
బాలుని విక్రమ ప్రావీణ్య మెల్ల
జనులకు వివరించె సక్తితో దీని; 

______ _
భారత రణ క్షేత్రమున నభిమన్యునివలె బాలచంద్రుఁడు తనమిత్రుల తో గూడి విక్ర మించినాడు. అదియొక సంకుల సమరము. యుధ్ధ నీతిని ప్రక్కకు నెట్టి శత్రు వీరులను మూకుమ్మడిగా నెదిరి మట్టు బెట్టుటయే నలగాముని వర్గమువారి యెత్తుగడ. నరసింహుఁడు నలగాముని తమ్ముఁడు. పద్మ వ్యూహమున బ్రవేసించిన యభిమన్యనివలె బాలచంద్రుఁడు పలనాటి వీరుల నెదుర్కొన, నరసింహుఁడు తన వర్గమువారికి కను సైగ జేసెను. మూకుమ్మడిగా మీదపడుడని యాసూచనకు సంకేతము. వీరులందరు బాలుని పైబడి దాడిచేయసాగిరి. అయినను బాలచంద్రుఁడు బెదరలేదు. మడమ వెనుకకు ద్రిప్పలేదు. కొంగలగుంపుపై దాడిచేయు గ్రద్ద వలె, కరులపై లఘించు సిహమువలె, పెదిదపులి యావుపయి దాడిచేసిన వడువున, సేనల పై లంఘించి చీల్చి చెండాడెను. కత్తులతో వారి కుత్తకలు ఖండించెను, కాలుసేతులను తుండె తుండెములుగా నరకి పోగులు బెట్టెను. నాటి భయంకర యుధ్ధమున అక్రమ యుధ్ధమును ప్రోత్సహించిన నలగాముని తమ్ముఁడగు నరసింహ నాసుని తలనరకి తన కత్తిమొనకు గుచ్చి తెచ్చి మలిదేవరకు కానుక సమర్పించెను. ఆమరునాడు అందరేకమై నాగమ్మ ప్రోత్సాహమున దారుణాతి దారుణముగా బాలచంద్రుని నరకి జంపి ప్రతీకారమును దీర్చు కొనిరి. వీరుడై యెగసి పరుల గుండెలలో భయంకర స్వప్నమై దోచి విక్రమించి వీరుడై ప్రతిష్ఠనంది బాలుఁడు వీర మరణమును వరించెను. బాలచంద్రుని కీర్తి యాచంద్ర తారార్కమై నేటికీ పలనాట నింటింటా మారుమ్రోగుచునే యున్నది. ఇట్లు బాలుఁమరుఁడైనాడు. తిక్కన యభిమన్యు నెంతఘనముగా చిత్రించెనో , శ్రీనాధుఁడునూ నంతకు తక్కవ గానిరీతిని బాలచంద్రుని చిత్రించి ధన్యుఁడయ్యె ననుట తధ్యము!
పలనాటి వీర చరత్రమున నెన్నదగిన పాత్రలు 
1 బాలచంద్రుఁడు 2 బ్రహ్మ నాయుఁడు 3 నాయకురాలు నాగమ్మ ;
ఇది వీర చరిత్ర యగుటచే వీరునకే ప్రధమ ప్రాధాన్యము. బాల చంద్రుఁడు బ్రహ్మ నాయుని యేకైక కుమారుఁడు. మగువ మాంచాల యితని భార్య యాపన్నసత్వ(గర్భవతి) నవోఢ.
బాలుఁడు మహాసాహసి, మహావిక్రమ సంపన్నుఁడు. ప్రభుభక్తి పరాయణుఁడు. రణకోవిదుఁడు. యెంతమంది మీదపడినను చలింపక వెనుదిరుగక , శత్రు సంహారమే యెకైక లక్ష్యమై సాగిపోవు మహావిక్రమాటోపముఁగలవాడు. కూటయుధ్ధమున వంచనతో తనను గెలువ నుంకించిన నరసింహ నాయుని దారుణముగా జంపి వాని శిరమును కత్తికి గుచ్చి శత్రువులను హెచ్చరించిన ధీశాలి. యుధ్ధరంగమున వీరమరణమును వరించిన రణవీరశిఖామణి! మగువ మాంచాల యితనికి తగిన భార్య! యుధ్ధమునకేగు భర్తను ప్రోత్సహించి స్వయముగా రక్తముతో వీరతిలకమును దిద్దిపంపిన ధీరవనితామతల్లి!
బ్రహ్మ నాయుఁడు పలనాటి కృష్ణునిగా బ్రసిధ్ధినందిన యశస్వి! భారత యుధ్ధమున నిరువాగులకు శ్రేయమును గూర్చుటకై శ్రీకృష్ణుఁడెట్లు పరిశ్రమించెనో, యంతటిపరిశ్రమమును చేసినవాడు బ్రహ్మనాయుఁడు. నలగామునకు , మలిదేవునకు నడుమ రగిలిన వైరము నుపశమింప జేయుటకు కతడు చేయని యత్నములేదు. పడనిపాట్లులేవు. యెప్పటికప్పుడు నాగమ్మ కుటిలముతో నాతడొనర్చిన హితకార్యములన్నియు వ్య్రర్ధము లగుచుండెను. నిరువాగులకు యుద్దమును వారించుటకు నతడొనర్చిన యత్నములన్నియు నేటిలో బిసికిన చింతపండు వలె వ్యర్ధములు కాగా విధిలేక సమరమునకు గడంగెను. ఆవలిపక్షమువారు అధర్మ యుధ్ధమొనరించినను తనవారిని ధర్మము తప్పరాదని వారించెను. బాలుడు నరసింహుని తల నరకి తేగా నతని యకృత్యమును నిర్ ద్వంద్వముగా నిరసించెను. తుదకు నలగాముడోడిపోయి చేతికి చిక్కినను వానిని జంపక క్షమించి తిరిగి గురజాలకు రాజుగా జేసి సగౌరవముగా బంపెను. తనను చివరి వరకు నమ్ముకొన్న మలిదేవరకు మాచర్ల రాజధానిగా రాజ్యము నప్పగించి తనప్రభు భక్తిని చాటుకొనెను; అతనికి పుత్ర శోకాదులులేవు. కాప్యదీక్షయే ప్రధానము. ప్రజల యోగక్షేమ ములే ప్రధానము. అతడొకత్యాగశీలి! ప్రభుభక్తికి ప్రతీక! ధర్మావతారుఁడు .పలనాటికృష్ణుడను బిరుదమతనికి సర్వధాసముచితమైనదే!
కుటిలనీతికి, కుహనాతంత్రములకు, మిత్ర విరోధమునకు , విషప్రయోగాలకు, అహంకారమునకు, అసంబధ్ధకార్య కలాపములకు, నిలువెత్తు సాక్ష్యము నాయకురాలు నాగమ్మ; భారత కధలోృశకుని వంటిది నాగమ్మ! తనను నమ్మిన వారిని చేతిలో నదిమి పెట్టి నట్టేట ముంచుట యీమెస్వభావము: తన పంతము నెగ్గుటయే యీమెకు ప్రధానము . మోసపూరితంగా మలిదేవాదులను కోడిపందెములలో నోడించి రాజ్యమువెడల నడచి యవధి యనంతరము రాజ్యమీయనీయక సంధి పొసగనీయక వేధించి బలవంతముగాయుధ్ధమునకు ప్రేరణజేసినదీమెయే! ఈమెకుటిలమువలననే పచ్చని పలనాడు సర్వ నాశనమై పీనుగుల దిబ్బగామారినది; నేటికీ పలనాట దుష్టవనితలను యేమే నాగమ్మలా తయారైనావు. అనిచెప్పు కోవటంవింటూఉంటాము;
ఇదీ పలనాటి వీర చరిత్రము
శ్రీనాధ కవిసార్వ భౌముఁడు మంజరీ ద్విపదలో సర్వజన వేద్యముగా రచించి ప్రజాసాహిత్యమునకు రూపు రేఖ లను తీర్చి దిద్దినాడు.
ఇఁతటితో నీప్రసంగమును నిల్వరింతము. రేపు శ్రీనాధుని జీవన ప్రస్థానమున తుదిమజిలీ! చెప్పుకుందాము నేటికి సెలవు.

Friday, 26 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 50

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

ఒక నాడు " రసికుడు పోవడు పలనాడు" అనియెకసెక్కము లాడినశ్రీనాధునకు తుదకు పలనాటి నివాసము తప్పలేదు గదా! ఆహా! విధియెంతవిచిత్రమైనది. ఒకనాడు ప్రౌఢ కవిత్వమే కవిత్వ మని గొప్పలు జెప్పిన శ్రీనాధుడు నేడు పదకవితకు పట్టము గట్టక దప్పలేదు. ప్రజా కవిత్వ మేదియో యతనికి యిప్పుడెరుక పడినది. అందుచేతనే నేడు ద్వపద రచనమునకు బూనుకొనినాడు. ద్వపదయనునది దేసి రచన యదిపదమే గాని పద్యముగాదు. ద్వి పదము రానురాను ద్వపదగా మారినది.
ప్రాఙ్నన్నయ యుగమంతయు నిట్టి పాటల లోనే సాహిత్యము విస్తరిల్లినది. తరువోజ, మధ్యాక్కరలు నాటి దంపుడు పాటలకు ప్రతిరూపములు. శ్రమైక జీవులగు పామరులు పనులుజేయునపుడు శ్రమాపనోదనార్ధమై యిట్టి పాటలను పాడుకొనెడివారు. ద్విపదయు నట్టిదియే! చిన్నచిన్న పదములతో యలతియలతి భావములతో రెండు పదములల్లి పాడుకొనెడివారు. రానురాను యివి పండితుల యాదరణమునకు నోచుకొని శివకవుల నాటికి సాహిత్య రూపమునకు వచ్చినవి. ద్వపద సాహిత్యాభివృధ్ధికి మూలకారకులు శివ కవులేననుట తథ్యము!
ప్రజల నాడి యిప్పటికి శ్రీనాధునకు బోధపడినది. కావున ప్రజాసాహిత్య సాధనగా ద్విపద నెన్నుకొన్నాడు. మంజరీ ద్విపద యొకభేదము. యిదియలనాటి యక్షగానములందునను, హరికధలయందునను కధానిర్వహణమునకు ఉపయోగించు చుండెడివారు. చెప్పునది వీరగాధ పాటకు యాటకు మంజరీ ద్వపద యనుకూల మగుటచే కవిసార్వభౌముడు దానినే స్వీకరించినాడు.
పలనాటి కధ యొక బృహత్ గ్రంధము తాటియాకులలో చివికి పోవుచున్న నీగ్రంధమును శ్రీ అక్కిరాజు ఉమాకాంతం పండితులు దానిని బరిష్కరించి 1911 సం లోప్రకటించినారు . మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారిదయ వలన నాకది చిక్కినది. అక్కడక్కడ శిధిలమై యున్న దానిసాయమున నేనీగ్రంధమును మీకు పరిచయము జేయగలుగుచున్నాను. మిత్రునకు కృతజ్ఙతలు!
పలనాటికధ మిగుల పెద్దది. దానికిది సంగ్రహ పరిచయము_
పలనాటి రాజ్యమునకు ప్రభువు అనుగురాజు. అతనికి మువ్వురు సతులు. క్రమముగావారికి
నలగమరాజు, నరసింహరాజు, మలిదేవరాజు మున్నగు కుమారు లుదయించిరి. వారితల్లులు వేరు. సోదరులు. తండ్రియనంతరము నలగామరాజు ప్రభువయి గురజాల రాజధానిగా పలనాటినేలెను. బ్రహ్మనాయుడు మంత్రి. మలిదేవరాజప్పటికి పిన్నవాడగుట బ్రహ్మ నాయుని రక్షణలో నుండెను. కతిపయదినములకు బ్రహ్మనాయుని కోర్కె ననుసరించి మలిదేవునకు కొంతరాజ్యమును నలగముఁడొసగెను. మాచర్ల రాజధానిగా కొంత పలనాటికి మలిదేవుడు ప్రభువయ్యెను. బ్రహ్మ నాయుడు మంత్రిగా దోడ్పడుచుండెను.
బ్రహ్మ నాయుని స్థానమున నాయకురాలు నాగమ్మ నలగామునకు మహామంత్రిణి యయ్యెను. నాగమ మిగులజాణ కుటిలస్వభావి, అహంభావి, అంతవరకు ఆనందముగా సాగుచున్న యాయన్నదమ్ముల మధ్య మాయమాటలతో వైరమును రగిలించెను.భారత కధలో శకుని వంటిది నాగమ
తుదకది భయంకరమైన యుధ్ధమునకు దారిదీసి పలనాటివీరుల దుర్మరణమునకు కారకమయ్యెను. నాగమ మాయమాటలువిని నలగాముడు మలిదేవుని కోడిపందెములలో మోసముతో జయంచెను. ఓటమిఫలితముగా వారికి నేడేండ్లు వనవాసము విధింప నాయవధిని వారు పూర్తి యొనరించి రాజ్యభాగము నడుగ కాదని నలగాముడు వారిని యుధ్ధమున కాహ్వానించెను. నాగులేటి యొడ్డునగల కారెమపూడిలో నిరు పక్షములకు భయంకరమైన యుధ్ధముజరిగెను. అందు యిరు పక్షములవారు విశేషముగా మరణించిరి. చివరకు విజయము ధర్మ పక్షమును వరించినది. మలిదేవుడు జయమునందు కొన్నాడు.
నేటికింతటితో నీప్రసంగమును విరమింతము రేపుఃతక్కన ముచ్చట. సెలవు.

Thursday, 25 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు -49

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

శ్లో శరదిందు వికాస మందహాసామ్ !
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్!
అరవింద సమాన సుంద రాస్యామ్!
అరవిందాసన సుందరీ ముపాస్యే!
పలనాటి వీర చరిత్రము
ద్విపద: శ్రీ రఘు నాయకుఁ జిత్తమం దెంచి
శ్రీకంఠు పరమేశు శివు నాత్మ దలచి
పార్వతీ దేవికి భావించి మ్రొక్కి
శివగణంబుల నెల్ల చితించి పొగడి
ప్రాకటంబుగ విష్ణు ప్రార్ధనల్ జేసి
-----+++-------+-----+++
చెప్ప నేర్చిన వాడ చెలగి మాచర్ల
చెన్నకేశవ స్వామి సేవ నిరతుండ
వలను భారద్వాజ వంశ వర్ధనుడ
కవిసార్వభౌముడన్ ఘనత గన్నట్టి
శ్రీనాధు డనువాడ శివ భక్తి పరుడ
శాశ్వతంబైనట్టి సద్ గ్రంధ మొకటి
చెప్పబూనీ మనసు చెలరేగియుండ
-------++++++++++++++-
చెన్నకేశవు డప్పుడు దానిట్టు లనయె;
" సౌర్యంబు పుణ్యంబు సమకూర్చునట్టి
పలనాటి వీరుల భాగవతంబు
ప్రకటితంబుగ నీవు రచియించి మాకు
నంకితం బొనరింప ననువొందు చూవె"
----------------------++
మంజరీ ద్విపదగా మన్నించి నేను
చెప్ప బూనితి వచః శ్రీలు మెఱయంగ;
రెండవ కురు పాండవ యుధ్ధము గా తెలుగు నాట ప్రసిధ్ధినందిన పలనాటి వీరచరిత్రమును మంజరీ ద్విపదలో రచించిన ఘనుఁడు శ్రీనాధుఁడు. కవిసార్వభౌమునిగా , ప్రౌఢ కవిగా పేరొందిన శ్రీనాధ మహావి సులభాతి సులభమై పామరలకు గూడ వేద్యమై యొప్పారు చున్న నిట్టిగ్రంధ మును అమ్మహనీయుడొనర్చుట యబ్బుర పాటు నొనరింపక మానదు. పైగా మాచర్లలో వెవసిన చెన్నకేశ్వర స్వామి తనకు కలలో గనిపించి పలనాటి భారతమునా పేరొందిన పలనాటి వీరులకధ ,ద్విపద లో కావ్యముగా వ్రాసి తనకంకితమొసంగ గోరెనట! ఆహా శ్రీనాధుడెంత ధన్యుఁడు. విష్ణుదేవుని దర్శన భాగ్యము నందెను.
శ్రీనాధుని వంటి మహాకవి యింత దిగువకు వచ్చి ద్విపదలో కావ్య మేలవ్రాయవలెను? గొప్పప్రౌఢగ్రంధమునే వ్రాయవచ్చునుగదా? యనుసందేహము మనంబందు గలుగక మానదు. దానికి ముందుగా నాటికి తెలుగు నాట గల రాజకీయ పరిస్ధితులను బాగుగా బరిశీలింప వలసియున్నది.
శ్రీశైలమునుండి తిరిగి వచ్చునప్పటికి తెలుగునాట పరిస్ధితులుతారుమారైనవి. ఒడ్డెరాజుల చేతిలో రెడ్డి రాజులు ఓటమిని బొందిరి . ఒడ్డెరాజుల పాలన లోనికి రెడ్జిరాజ్యమంతయు వచ్చినది. ఆవేమారెడ్డి , మున్నగువారేమయ్యిరో నూహింప నశక్యము. పాపము కవిసార్వభౌముని నడుము విరిగి నట్లయినది. ఇంతటితో నేటికీ ప్రసంగమును నిల్వరింతము రేపుతక్కినది. సెలవు

Wednesday, 24 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు - 48

కవిసార్వ భౌముఁడు శ్రీ నా ధుఁడు
శా; పంచారామ విలాసినీ ధవళ దృక్పాఠీన జాలాయ మా 
నాంచత్కారము నిర్నిబంధన మనోజ్ఙా కార రేఖా
పంచా స్త్రుండగు నా కుమారకుఁడు దర్ప స్ఫూర్తి నవ్వీటిలో
సంచా రం బొనరించెఁ గాంచన మహా సౌధాగ్ర భాగంబులన్ ;
శివరాత్రి మాహాత్మ్యము- 2ఆశ్వా- 17 వ పద్యము
భావము: ఇది ముందు మనము చెప్పుకొనఁ బోవు శివరాత్రి మాహాత్మ్యము లోనిది. సుకుమారునివర్ణనము. వానిరూపము మిగుల గొప్పది. దక్షారామం లోనేగాక పంచారామ సీమలలో వానిని జూచిన మానినీ మత్స్యముల తెలిగన్నులనే మత్స్యములను బట్టు వలవంటిదట! నిబమధనారహితుఁడయిన మనేహరమైన ఆకార రేఖతో మన్మధుని దలపించు నాతఁడు మహాగర్వియై కాంచనమయ మైన మేడల శిఖరములయందు నాపట్టణమున సంచరింప సాగెనని దీని భావము ; ముందు ముందు ఈపద్యమును సమన్వయ మొనరింతము. ముందుకు బోదము.
అవచి తిప్పయకు హరవిలాసము నంకిత మొసఁగి యతడిచ్చిన ధనమును చేతఁబట్టి శ్రీనాధుఁడు
మహాశైవ క్షేత్రమగు శ్రీశైలమునకు ప్రయాణ మయ్యెను. రెడ్డిరాజులపై నొడ్డెరాజుల తిరుగు బాటువార్త యొకటి యతని చెవులఁ బడెను. ఇటు బహమనీ సుల్తానులు విజయ నగరముపై దండెత్త నుంకించు చుండుటయుఁదెలిసెను. గోరుచుట్టుపయి రోకలి పోటు చందమున కాకతీయులపై మొగలు రాజుల దండయాత్రయు నారాజ్యము పతనమై గోల్కొండ రాజుల యేలుఁబడి లోనుండుటయు, నొకటొకటిగా నన్నియు చెడువార్తలే చెవిని బడసాగెను. రాజమహేంద్రవరము ఒడ్డెరాజన్యుల పరమగుటకు సిధ్ధముగానుడుటయు, దుఃఖ దాయకమయ్యెను. ఇదీ అప్పటి రాజకీయ స్ధితి.
దైవముపై భారముంచి ప్రయాణమును కొనసాగించెను. శ్రీశైవమున శైవ మఠమున బస యమిరినది. భ్రమరాంబా మల్లిఖార్జనుల దర్శనమైనది. కర్తవ్యాలోచన చేయసాగెను." ఇపుడా ప్రభువులు సంకట స్ధితిలో నున్నారు. యీస్ధితిలో తానేగి చేయునదేమి? సలహాలిచ్చుటకు సింగనా మాత్యుఁడు కలఁడుగదా! తానిప్పుడు కొంకాలమిచటనే యుండుట లెస్స. పరిస్ధితుల యనుకూలము ననుసరించి కొండవీటికేగ వచ్చును" అనితలపోయుచు దైవదర్శన భాగ్యమున కలరుచు నట కొంతకాలము గడుప నిశ్చయిచెను.
శ్రీ శైలము నందలి శైవ మఠమునకు అధికారి పువ్వుల శాంతయ్య యను జంగము దేవర యతడు చాలకాలమునుండి శైవ సంబంధమగు నొక కావ్యమును దనపేర వెలయింపఁజూచుచుండెను. శ్రీనాధ కవి రాకతో నది చిగురులుఁ దొడిగినది. యొకానొక శుభముహూర్తమున శ్రీనాధుని కడ కేగి యంజలి ఘటించి " కవిసార్వ భౌమా! తమ రాకచే నామఠము , నాజన్మమును కృతార్థములైనవి. నాదొకటి చిరకాల వాంఛ మిగిలియున్నది. లోకోత్తరమగు శివరాత్రి మాహాత్మ్య కధను తమరివలన వనవలెనని, నేటికి యాపరమ శివుని దయచేనాకోరిక దీరు నవకాశముఁజిక్కినది . నావిన్నపమును మన్నించి దయతో నాగ్రంధరాజమును నాపేర వెలయిపుడు; ఇది మీకుఁ దక్క నన్యులకు సాధ్యముఁగాదని బలికెను. "
శ్రీనాధుఁడు సమ్మతించి స్కాంద పురాణ కధను తనకవితచే మెరుగులు దిద్ది చతురాశ్వాస పరిమిత శైవ ప్రబంధముఁగా తీర్చి దిద్దెను. శివరాత్రి మహాత్మ్యమును ఐదాశ్వాసముల కెక్కుడుగా కవిసార్వ భౌముఁడు రచించెనని కొందరివాదన. వాదనలకేమి వేయి. కానీయాగ్రంధము నేఁడు దొరుకుటయే గగనమే! మనయదృష్టము వలన మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి తోడ్పాటుతో 1930 సం:లో ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన (అక్కడక్కడ సిధిలమైన) ఒక ప్రతి లభించినది. దానిసాయమున నాపరిశీలనకు అవకాశము చిక్కినది వారికి మనఃపూర్వక ధన్యవాదములు!
ఇందలి కథ:- శివ విష్ణువులు తామే గొప్పవారమని యెవరికి వారు కలహింప శివుడు వారిని బిలిచి పరీక్షఁబెట్టుట. వారాపరీక్షలోనోడి శివుఁడే తమకన్నమిన్న యని ప్రకటించి శివ మహిమను దెలుపఁగోరుట, శివుఁడు వారికి శివరాత్రి మహిమమును సోదాహరణముగా వివరించుట యిందలి ముఖ్య విషయము. ఆశివరాత్రి మహిమను దెలుపుటకు శివుఁడెన్ను కున్న కధ సుకుమారుని కధ.
ఇది యించుమించు కాశీఖండములోని " గుణనిధి" కధకు సమానము. పుట్టుతో నుత్తమ బ్రాహ్మణ కులజాతులై వేద వేదాంగ పారంగతులై రూపవిజిత మన్మధులై విధివశమున చెడుసావాసములకు లొంగి, జూదపరులై, చోరులై, మద్యమాంస భక్షకులై, పరాంగనాసంగమ లోలురై యింటగల ద్రవ్యమంతయుఁదొంగిలి గొనిపోయి, తుదకు యింటికి నుండి గెంటివేయబడి యతినికృష్టపు బ్రతుకు చవిజూచి , చివరకు గతజన్మ సుకృతమోయేమో శివరాత్రినాడు ఆహారములభింపమి నుపవసించి , మరునాడు వ్రేపకడ యాహార సంపాదనకై శివాలయమున బ్రవేశించి , ప్రసాదభక్షణ మొనరించుటచే శివానుగ్రహ పాత్రులయి కైలాసము నందుకొన్నారు. సరిగా నిలాంటి కధ యే మరియొకటి యున్నది. అదితెనాలి రామకృష్ణుని చే చిత్రింపఁ బడిన పాత్ర. "నిగమ శర్మ" అతఁడు వీరికిఁదమ్ముఁడు . వీరికన్నామిగుల ఘనుఁడు.
పైపద్యము ఇతని గొప్పదనమునే వెల్లడించు చున్నది. యిక విషయమునకు వత్తుముగాక!
వింధ్యాచల ప్రాంతమును హేమపాలుఁడు పరిపాలించు చుండెను. ఆతని మహామంత్రియు, గురువునగు యజ్ఙదత్తునకు కులసతి సుశీల యాపుణ్య దంపతులకు చాలకాలమువరకు సంతతిలేదు .
తే: తవయ సంతాన లబ్ధి దౌ దవ్వుగాగ
విభవ సంపత్తి గల్గియు విన్నఁబోయి
పుత్ర వదనావ లోక నోధ్భూతమైన
శర లతా కాననము వోలె జవ్వనంబు
; - సంతాన లేమిచేత వారి యవ్వనం రెల్లు పూల వనంగా మారిపోయందట! రెల్లు తెల్లగా పూత పూస్తుంది చూడటానికి చాలా అందంగా వుంటుంది. కానీ కాయలుమాత్రం దానికి రావు. వీళ్ళుకూడా అలాగే యిరుగు పొరుగు లకు కనిపిస్తు న్నారు. కానీ యేంప్రయోజనం? యజ్ఙదత్తుని యజ్ఙాలు ఫలించాయి. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. చాలాగారాబంగా పెంచారు. తనకు వచ్చిన వేదాది విద్యలను తండ్రి నేర్పాడు పెద్దవాఁడయ్యాడు. యువతీజన మన్మధుఁడై యలరారుతున్నాడు. వాడి దృష్టి యిప్పుడు యెప్పుడూ ఆడవాళ్ళమీదే! దీనికి తోడు వాడికి దుష్టజన సాంగత్యం అబ్బింది. వారితోఁగలసి జూదమాడటం నిత్యకృత్యమైంది. తల్లికి తెలుసు. పిల్లడి మీదమమకారం తండ్రికి తెలియనీయకుండా ఆమెను వారించింది. అదివాడికి లోకువ గామారింది. యింటనున్న మణిమాణిక్యాదులు సంపదఅంతా జూదరులపాలైంది. యిప్పుడు దొంగగాకూడా మారాడు. వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, జూదంలో మొనగాడయ్యాడు.
పాపం! యజ్ఙదత్తునకు యీవిషయాలుఁదెలియవు. ఇంటిదొంగ గదా! పట్టనెవ్వరి వశం? ఒకనాఁడు యజ్ఙదత్తుఁడు రాజసభనుండి యంటికి వస్తున్నాడు. దారిలో నొకజూదరి తన నవగ్రహ వేష్ఠన మైన అంగుళీయకాన్ని ధరించివిలాసంగా వెళుతున్నాడు. పురోహితునకు పట్టరాని కోపం వచ్చింది. ఆపాడు."ఒరే/ దొంగా! నీకెక్కడిదిరా యీయుంగరం? చెప్పక పోతే రాజ దండన తప్పదన్నాడు." దానికి బదులుగా" మీరు వేదాది విద్యలలో యెంత పండితులో మీపుత్రరత్నం జూదంలో అంతగొప్ప పండితుడు. అతడుజూదమాడి యోజినదీ యుంగరము. గెలిచితిమి. మేము దొంగలమా? యేమి?" యనిఁబలుక నవమానముతో గబగబ నిటికేగి జరిగిన దంతయు నెరింగెను. చెడిపోయినకుమారుని యందు కరుణఁజూపక యిలువెడల నడచెను.
సుకుమారునకు పెద్దలయాస్తిని గుడించుటయే దెలియునుగాని గడించుట యతనికేమి దెలియును? అడవినిబడినాఁడు. ఆకలితో పేగులు మాడుచున్నవి. అప్పుడు ఇల్లు , తల్లియు గుర్తుకు వచ్తినారు. కన్నతల్లిని దలచుకొని ,
చ: అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయిం బొడతేర, గిన్నెలో,
బెరుఁగును, వంటకంబు, వడ పిందియలున్, గుడువంగ బెట్టు ని
ర్భర కరుణా ధురీణ యగు ప్రాణము ప్రాణముఁ దల్లి యున్నదే!
హర హర! యెవ్వరింక కడుపారసి బెట్టెద రీప్సతాన్నమున్;
- అనియాయడవిని బడి వల వల యేడ్చినాఁడు. ఇంకను బుధ్ధిరాలేదు. ఆయటవిలో నొకఛండాలుఁడు జాలిపడి వాని నింటికి గొనిపోయెను.ఃకూడు వెట్టి నిదురింప గూడునిచ్చెను. ప్రత్యుపకృతిగా నతని భార్యను లేపుకొని పారిపోయెను. వారట్లు పోయి కిరాతులలో గలసిరి వేచాడుట , దొంగతనము, దోపిడీ లు జీవన వృత్తులయినవి. కొంతకాలమున కామాలెతయు వీనిని బరిత్యజించెను.
అపుడీతడు అడవినిబడి పోవుచు శివరాత్రమున ఆహారము లభింపమి నుపవాసియై ప్రక్కనున్న శివాలయమునకేగి, భజనచేయు భక్తులు వెడలునందాక కాపుండి వ్రేగు సమయమున వారు బోవ గుడిలోదూరి, ప్రసాదమును భుజియించి , రేయంతయు నిదుర లేమిచే నందే నిదురించెను. ఇంతలోభక్తులరుదెంచి దొంగ యనిభావించి చావమోదినారు. విగత జీవుడయినాడు. నరకమునుండి యమభటులును, కైలాసము నుండి శివభటులును యరుదెంచిరి' వాదోపవాదముల యనంతము అతడు శివభక్తుల ప్రాపున కైలాసమున కేగెను. ఇదీ కధ!
శివరాత్రినాఁడు పవసించి, జాగరణమొనర్చుట, కారణములుగా నతఁడు కైలాసమున కేగగల్గినాడు. యెంతటి పాపియైనను శివరాత్రి నాడు ఉపవసించి జాగరణమొనరించిన , వారికి కైలాస ప్రాప్తి తధ్యము! అనిఫలితార్ధము.
శ్రీనాధ కవిత యిందు కొంత ప్రౌఢతనుఃప్రదర్శంచినను, గత గ్రంధకధలను తడిమి కావ్యమును విరచించుటచే, నంతగా రాణకెక్క లేదని ఫలితార్ధము. యింతటితో నేటికి ముగింతము. సెలవు!

Tuesday, 23 June 2015

కవిసార్వ భౌముడు శ్రీనాధుఁడు - 47

కవిసార్వ భౌముడు శ్రీనాధుఁడు

తేే: రంభ! రంభామ్ర ఫల సమగ్రంబుఁగాఁగ
నమృత దివ్యాన్న భిక్ష కామారి కొసఁగె,
రాపుఁ జన్నుల కెలను రారాజు పట్టి
పట్టి యెత్తిన నఖ రేఖ బయలు పడగ;
అప్సరలలో నొకతెయగు రంభ రంభాఫలములను, మామిడి పండ్లను జోడించి దివ్యాన్న భిక్ష కామారికి యొసగినదట . ఆయొడ్డించుటలో బాహుమూలములనెత్తి యగపడ జేయుచు నలకూబరుడొనర్చిన నఖక్షతముల నెత్తిచూపుచున్నదట! యిదిభవుని రెచ్చ గొట్టుటేగదా!
అసలు దేవలోకమున నుండదగిన యప్సరో భామినులకిట నేమిపని? వారీ దారుకా వనమున నివసింప కారణ మేమి? యనుప్రశ్న మనలోకొందరికి ఇప్పటికే గల్గియండవచ్చును. వినుడు. దారుకావనము హిమగిరి కంథరములకు సమీపమునగల యతిసుందరమైన వనము; సర్వకాలములయందును యటవసంతమే! నవ పుష్ప ఫల విరాజితమై నందనవనమును పోలియుండును. తత్కారణమున సప్తఋషులు దీనిని తపోవన భూమిగాఁజేసికొన్నారు. దేవేంద్రునకుృ వారినిజూచిన భయము. వారిదుర్భర తపంబున తనదేవేంద్రపాలన కెట్టిముప్పు గలుగకుండ యెప్పటి కప్పుడు వారితపోభంగ మొనరించుటకు రంభాద్యప్సరో భామినులకు ఒకవాడ నేర్పరచి యందుండ నియమించెను. వఅదికారణముగా వారిచ్చటనివసంచుచున్నారు.
దారుకావనము హిమవంతునిరాజధాని ఓషధప్రస్థమునకు నాతిదూరము. మామపైనలిగిన భవుఁడు పరివారముతో దారుకావనము నేతెంచినాడు. యధేచ్చా విహారములతో తృతీయ పురుషార్ధమునకు వన్నెలుదిద్దుకొను చున్నాడు.
ఉ: పెట్టెఁ దిలోత్తమాప్సరస భిక్ష ప్రియంబున భూతభర్తకున్
గట్టుఁబసిండి పాత్ర బులకండముతోడ ,ఘృతంబుతోడఁగ్రొం
బట్టుఁ బసిండి సిబ్బెములఁ బయ్యెద కొం గొక కొంతజారి చ
న్కట్టు లలాట లోచనుని కన్నులు మూటికి విందు సేయగన్;
ఇకతిలోత్తమ పసిడి పాత్రలో పులకండములు, ఘృతములను గలిపిదెచ్చి వడ్డించింది, యెలా?తానుగట్టిన క్రొత్త పట్టుచీరె కొంగొకింతజారగా నామెచనుకట్టుఅందమంతయు నాతని మూడు నేత్రములకు విందు చేయునట్లు భిక్షను వడ్డిచినది. నొత్తముమీద అప్సరల భిక్ష యైనది. ముందుకు నడచినాడు. సప్తఋషులయావాసములు కనులఁబడినవి. వారియాడువారు త్రిలోక మోహనులై యున్నారు
మ: దరహాసంబుల భ్రూలతా నటన ముద్రా విభ్రమ ప్రౌఢిమన్,
బరి హాసోక్తుల భావ గర్భ రస సంపల్లంపటాలోకన
స్ఫురణా భంగుల మౌని కాంతల మనంబుల్ చూరలాడెన్ మహే
శ్వరుఁడు ద్దామ విలాసి దారు వనికా వాటప్రదేశంబులన్ ;
కొందరినిఁజూచినవ్వుతున్నాడట! మరికొందరికి కనబొమల నాడిస్తో యేవోసంకేతాలుఁ బంపుతున్నాడట! కొందరితో వేళాకోళాలాడుతున్నాడట! మరికొందరినురససూచకంగా చూపులునిగిడి స్తున్నాడట! ఈవిధంగామునికాంతల మనస్సులను శివుడు కొల్లగొట్చాడట! అమాయకులైనయాఋషిపత్నులెల్లరాశంకరుని మాటలకు లోగి గిరి గహ్వరముల నతనితో నెధేఛ్ఛావిహారమొనరింప సాగిరి. సప్తఋషు లీయకృత్యమునకు గినికి యొక్కుమ్మడిగా బట్ట నుంకింప బట్టువడక, మహాలింగోధ్భవమును ప్రదర్శించినాడు . పాతాళమునుండి యాకాశమువరకు పరివ్యాప్తమై, నయాలింగాకారమును గాంచి వారద్భుతమునంది చేతులు జోడించినారు.
అల్లుని యాగడములనువిని మామ హిమవంతుఁడరుదెంచి మంచిమాటలతో నింటికి గొనిపోయెను. శివపార్వతుల సంసారము నిలఁ బడినది. శివుడు కాలకంఠుఁడుగదా ! ఆవిషయమునే పార్వతి యడుగ దానికి సమాధానముగా క్షీరసాగర మథన కధను శివుఁడు పార్వతికిృవినిపించెను. జగన్మోహిని యమృత వితరణము తో నీ రెండవ విలాసము పరిసమాప్త మగు చున్నది.
ఇక మూడవ విలాసము అర్జునుని పాశుపత సంసిధ్ధి. కాలకేయాది రాక్షసగణం దేవతలను బాధించు చుండగా అర్జునుఁడు పాశుపతం తో వారిని యుధ్ధంలో సంహరిస్తాడు. దేవతలకు మహోపకారం చేస్తీడు. ఆసందర్భంగానే వలచివచ్చిన తనను కాదనుటచే రంభ అర్జనునకు శాపమీయటం మొన్నగు విషయాలు యిందు ప్రసక్తమైనాయి. హిమగిరిపై అర్జునునిఃమహోగ్రతపంబు, మాయాశాంబర వేషధారియై శంకరుఁడు కిరీటిని పరీక్షింప నెంచటం, వారినడుమయుధ్ధం , చివరకు పాశుపత ప్రాప్తి, రాక్షస సంహారాది విశేషాలతోనీ మూడవవిలాసం వీర రస సమున్మేషమై ముగిసినది.
ఇట్లు కరుణ, శృంగార, వీర రసోచితములై, పరమేశ్వర లీలా విహార విలాస విజల్పితములై, శ్రీనాధుని ప్రౌఢ కవితాచాతుర్యమునకు నిదర్శనములై , హరవిలాసము ఒప్పారు చున్నది;
నేటికింటితో మనప్రసంగమును ముగింతము . రేపు తక్కిన విషయముల ముచ్చటించుకొందము,. సెలవు!

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 46

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ: ఏదేవి తురుముపై నేఁడు కాలము దాఁకఁ
కసుగంద కుండు చెంగలువ దండ;
యేదేవి సేవింతు రేకామ్ర నాధుండుఁ
గరి గిరీశ్వరుఁడుఁ గింకరులు వోలె;
నే దేవి మణి దివ్య పాదుకా యుగళంబు
బాతాళఁబతి మోచుఁబడగ లందు;
నే దేవిఁగొల్చి మత్స్యేంద్ర నాధాదులు
యోగ సంసిధ్ధికి నొడయు లైరి;
తే: యమ్మహా దేవి కామాక్షి యఖిల వంద్య,
దేవ తాదిమ శక్తి సందీప్త మూర్తి
యవచి దేవయ త్రిపురారి కర్ధి నొసఁగు
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు.
హరవిలాసము- అవతారిక- 3వ పద్యము.
భావము:- కంచిలో వెలసిన కామాక్షీ దేవి యవచి తిప్పయ్యకు ఆరాధ్య దేవత యగుటచే శ్రీనాధుఁడీ పద్యమున యాపరదేవత యాశీస్సులను తిప్పయకు అందజేయు చున్నాడు." యేదేవి సిగలో నలంకరించిన చెంగలువ దండ సంవత్సర పర్యంతము వాడకుండునో, ఏదేవి యాలయ ప్రాంగణమును ఏకామ్ర నాధస్వామియు వరదరాజ స్వామియు రక్షించు చుందురో, ఏదేవిమణిమయ పాదుకలను ఆదిశేషుఁడు మోయు చుండునో, ఏదేవిని సేవించి మత్స్యేంద్ర నాధాదులు యోగసిధ్ధిని పొందిరో, అఖిలవంద్య యు, ఆదిమ శక్తియు సందీప్త స్వరూపిణియునగు, అమ్మహాదేవి కంచి కామాక్షి యవచిదేవయ గారి తిప్పయకు సౌభాగ్య వైభవ ప్రాభవముల నొసఁగు గాక!"
అవచి తిప్పయ సెట్టి తాత తండ్రులు మంచిదాతలు. శ్రీశైల మహాక్షేత్రమునకు సోపానమార్గమును న్రిర్మింపఁ జేసిన ఘనులు. యిక తిప్పయ సుగంధ వ్యాపారమున ప్రసిధ్ధిగాంచి విశేష ధనమార్జించిన బేహారి యందుచేతనే బంగారమునకు సుగంధ మబ్బిన తీరగును యితనికి కావ్యమునంకిత మొనర్చినచో ననికవి తలపోసెను.
హరవిలాసము:- సప్తాశ్వాసముల పరిమితి గలయీగ్రంధ మునకు కవి హరవిలాసమని నామకరణము జేసినాడు. విలాస మను మాట చెవిని బడినంతనే మనకు చామకూర విజయ విలాసము స్మృతి పధమున మెలగును . విలాస నామకరణమున కీగ్రంధ మేమూలము. ఇందు మూడు విలాసములున్నవి. అందును ముగ్ధ, మధ్య, ప్రౌఢ, లన నాయికా శృంగార వర్ణనమున మూడువిలాసములను వర్ణించెను. కానినాయికల క్రమము మాత్ర మట వ్యత్యస్త మైనది.
ఇఁక నీహరవిలాసమున 1 ,2, ఆశ్వాసములందు చిరుతొండ నంబికధ వివరింపఁబడినది. చిరుతొండడు తిప్పయవంశమునకు మూలపురుషుఁడట! శివపారమ్యమైన యీకధ పరమశివార్చకుఁడగు చిరుతొండని యచంచలమైన ధృఢ భక్తికి నిదర్శనము; నిత్య జంగమార్చనా పరాయణఁడైనయాతడు కపటజంగమ వేషధారి కోరిక దీర్చుటకు తన యేకైక తనయుని జంపి యామాంసమునువండి యతనికి వడ్డించుట యొడలుగగుర్పొడచు ఘట్టము. పరమ కరుణ రసాత్మకముగా దీనిని తీర్చిదిద్ది శ్రీనాధుఁడు హరుని మొదటివిలాసమును పూర్తి యొనరించెను .
మూడవ యాశ్వాసము మొదలు యారవ యాశ్వసము వరకుఁగల కధ శివపార్వతుల కల్యాణగాథ. తారకాసుర సంహరణార్ధమై శివకుమారోదమునకు దేవతలొనర్చిన ప్రయత్నములు , మన్మధదహనము, పార్వతి తపము, శివుని దారుకావనవిహారము , నీలగళుఁడగుటకుగల కారణమును వివరిచుటకు క్షీరాబ్ధిమథనము జగన్మోహిని యమృతమును దేవదానవులకు బంచియిచ్చుట. మొన్నగు విషయములతో నీవిలాసము ముగియుచున్నది. కాళిదాస కుమార సంభవమునకు అనుకృతిగా సాగిన యీవిలాసమున శ్రీనాధుని శృంగార వర్ణనము తిరిగి పరాకాష్ఠను అందుకొన్నది . ఇందలి దారుకావన విహార ఘట్టము. పరమ శృంగారభాజనమై యొప్పినది. శివుఁడు బరితెగించి సప్తఋషుల భార్యతోగూడ వ్యభిచారమును సాగించుట. ఋషులు శివుని బచ్టనుంకింప లింగోద్భవమును బ్రదర్శించుట, యిందలి యితివృత్తము .
శా: బ్రాలేయాచల కన్య కాధిపతికిం బ్రమ్లోచ మోచా ఫల
స్ధూలాపూప ఘృతాన్వితంబుగఁ గడుందోరంపు బిచ్చంబుఁ గెం
గేలం బెట్టె నఖాంకుర ద్యుతులతోఁగీల్కొంచు మాణిక్య ము
ద్రాలంకార మయూఖ కందళ దళ వ్యాపార మేపారగన్;
ప్రమ్లోచ దారుకా వనంలో నివసించే అప్సరల లో నొకతె యామె తనయింటి కరదెంచిన అభవునకు అపూప ఘృత సహితమైన భిక్ష వడ్డిస్తోంది. యెలాగ? చేతికున్నఉంగరాల వ్రేళ్ళకున్న మాణిక్యపు కాంతులు విస్తరిస్తోండగా , శృంగార రసీభూతమైన తనమనస్సును దెలుపు చున్నదా యనునట్లు. అసలే క్రొత్త పెండ్లి కొడుకు వెనుక మరచిన శృంగారమంతయు మరల నెమరు వేయుచున్నాడు, ఈమెచర్యలు శివుని రెచ్చ గొట్టవా? యిపుడేదిదారి? మామపైనలిగి వచ్చినాడు. ఇంటికి బోోవుటకావీలుపడదు. మరి తృషదీరుట యెట్లు? యిక్కడి వారినే యొకపట్టు పట్టవలెనను భావమాతనికి కలుగుటకు ఆమెచర్యలుదోహద మొనర్చు చున్నవి యనికవిగారి భావము . ఇట్టివెన్నోవింతలీ ఘట్చమున కోకొల్లలు. కొన్నింటినైనను పరామర్శిచనిదే ముందుకేగుట తగదు. గాన నేటి కింతటితో నీప్రసంగమును నిల్వరింతము రేపు తక్కినవి. సెలవు.!

Sunday, 21 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 45

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
 హరవిలాస రచనము 
సీ: కలిత శుండాదండ గండూషి తోన్ముక్త
సప్త సాగర మహా జలభరములు ;
వప్రక్రియాకేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీ ధర రత్న మేఖ లములు;
పక్వ జంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్కదంబకములు;
వికట కండూల గండక దేహమండలి
ఘట్టిత బ్రహ్మాండ కర్ప రములు ;
తే: శాంభవీ శంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోప శాంతి గావించుగాక!
హరవిలాసము- అవతారిక- 5వ పద్యము.
కవి సార్వ భౌముఁడు కాశీఖండము ననూదిత మొనర్చి వీరభద్రారెడ్డి కంకిత మొనర్చెనను వార్త దేశ దేశములందు విస్త రించెను. అంత నాతని చిన్ననాటి యనుంగు మిత్రుడు సింహవిక్రమ పురి( ఇప్పటి నెల్లూరు) నివాసి, యవచి తిప్పయ సెట్టి శ్రీనాధుని తమ పట్టణమున కాహ్వానించెను. మిత్రుని యాహ్వనమందుకొన్న శ్రీనాధుఁడించుక యోచించి పాకనాటికి ముఖ్య పట్టణ మైవిరాజిల్లు సింహ విక్రమ పురికి బోవుట కుత్సహించెను. యెంతయైనను మాతృభూమియెడల గల మ మకారమును జూపనివారెవ్వరుందురు? తన చిన్న నాటి నేస్తులను వారి యాప్యాయతలను మదిలోనెంచి , ఆహాకాలమెంత విచిత్రమైనది? యెక్కడి పాకనాడు? యెక్కడి గోదావరీ తీరము? రెడ్డిరాజుల యాశ్రయము లభించుటంజేసి నాజీవన విధానమంతయు మారినదిగదా! నన్నింత వాని నొనరించిన వేమారెడ్జి ప్రభువర్యునకు సదాకృతజ్ఙతాంజలులు. మాతృ భూమిని పై దిదృక్ష నన్నుక్కిరి బిక్కిరి చేయుచున్నది. కాన నొక్కమారు పాకనాటి కేగి మనసార నాప్రాంతములను దర్శించి మగిఁడి వచ్చెదనుగాక! యని నిశ్ఛయంచు కొని వీరభద్రారెడ్డి యానతిచే సింహవిక్రమ పురికి పయనమాయెను.
కతిపయ పరివారముతో శిష్య సముదాయముతో మహదట్టహాసముగా నరుదెంచిన కవిసార్వభౌముని సగౌరవముగా స్వాగతించి తిప్పయ సెట్టి యోగ క్షేమములను విచారించి " మిత్రమా! మీయభ్యుదయమునకు నేనెంతయో సంతోషమున నుప్పొంగి పోవుచుంటిని. వ్యాపారార్ధినై కొమర గిరి రెడ్డి కడకు వచ్చినపుడు తాము రాచకార్య నిమగ్నులయి యుంట విశ్రాంతిగా మాటలాడు నవకాశము లభింపదయ్యెను. నేటికిగదా నాయదృష్టము పండినది . కవిసార్వ భౌమా ! నావిన్నపమును మన్నింపుము;
తే: ఆగమ జ్ఙాన నిధివి తత్త్వార్ధ నిధివి
బహు పురాణజ్ఙుఁడవు, శుభ భవ్య మతివి,
బాలసఖుఁడవు, శైవ ప్రబంధ మొకటి
యవధరిపుము , నాపేర నంకితముగ.
యని సవినయముగ నభియర్ధించెను. "కస్తూరీ కర్పూర చందన తాబూలమును , జాంబూనదాంబరాది వస్త్రాలంకారాదులను నతనికి సమర్పించెను. శ్రీనాధుఁడా మిత్రుని కృతిపతిగా గారవింప నెంచెను. " మిత్రమా నీకోర్కెఫలించునుగాక! నాసర్వేశ్వరానుగ్రహమున ' హర విలాస' మనెడి దివ్యమైన శైవ మహాగ్రంధము నొకదానిని నీపేర వెలయింతును గాక!" యనిపలికి ,కృతిపతికి యాశీస్సులనందించు కావ్య మంగళాశాసనమును యిట్లని యాశువుగా పలికెను.
ఉ:- శ్రీ మహీళా పయోధర హరి న్మణిహారము , హస్తి భూధర
స్వామి, పయోజ సంభవుని జన్నముఁగాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచిశ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
ధీమణి మండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్ధుఁ జేయుతన్; -
అని శుభాశంసనమ్ములం బలికి హరవిలాస రచనమును ప్రారంభించెను. రచన సాగుచునే యున్నది. ఇంతకు నీయవచి తిప్పయ శ్రేష్ఠి చేయువ్యాపారమేమి? రారాజులతో నీతనికి గలసంబంధమేమి యనువిషయములను యించుక బరిశీలింతము. తిప్పయ సెట్టి నెల్లూరు, కాంచీ పట్టణములయందు సుగంధ ద్రవ్యముల నమ్ము బేహారి. కస్తూరీ జవ్వాది చందనము అగరు సాంబ్రాణి పచ్చకప్పురము యాలకులు లవంగములు మొన్నగు సుగింధ వస్తు వ్యాపారములో దిట్ట.
మ: తరుణా సీరి తవాయి గోవ రమణా స్ధానంబులం  జందనా
గరు కర్పూర హిమాంబు కుంకుమ రజః కస్తూరికా ద్రవ్యముల్ ,
శరధిన్ కప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్య కులోత్తముం డవచి తిప్పం డల్పుఁడే యమ్మహిన్;
తరుెణా, చైనా, సింహళము, హవాయి,గోవా, సుమిత్రా , జావా, మున్నగు దేశములనుండి , కస్తారీ, జవ్వాది, కుంకుమపూవు , మున్నగు సుగంధ ద్రవ్యములను , సముద్రమార్గము ద్వారా," కప్పలి- జోగు- లని పేరొందిన నౌకలలో దెప్పించి రారాజులకు సరఫరాయొనర్తెడువాఁడట! వసంత రాయఁడనిపేరొందిన కుమార గిరి రెడ్డికి వసంతోత్సవ నిర్వహణమునకు టన్నుల కొద్దిగా కస్తూర్యాది సుగంధ వస్తువులను సప్లయి చేసెడు వాడట! మన రాజులకేగాక, ఢిల్లీసుల్తాను వారికి, ఫిరోజ్ ఖాన్ గాపేరొందిన గల్బర్గా సుల్తాను వారికి, హరిహరరాయల వారికి నితని సుగంధ వస్తువులు అందించు చుండెడి వాడని హరవిలాస యవరారికా పద్యములు నిరూపించు చున్నవి.
మ: ఖుసిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో , నీకరా
భ్యసన ప్రౌఢి నుతించురా యవచి తిప్పా! చంద్ర సారంగ నా
భి సముద్పాదిత తాళవృంత పవన ప్రేంఖోల్లన ప్రక్రియా
వసరోదంచిత సార సౌరభ రస వ్యాలోల రోలంబముల్;
భావము:- సుల్తాన్ వారు సంతోషంగా కొలువుఁ దీరియుండగా పరిచారికలు తాళవృంతములకు తిప్పయ సెట్టియంపిన కస్తూరిని పూసి గాలివీతురట! అపుడా సువాసనలకు సుల్తాను మైమరచు చుండగా నాసుగంధమునకు సమాకర్షింపఁబడిన తుమ్మెదల దండులా సభాభవనము చుట్టును తిరుగుచుండు దృశ్యమును గాంచి సుల్తానువారు మేలైన సుగంధ ద్రవ్యముల నేరిపంపు నీచేతి గొప్పదనమును ప్ర శంసించు చుందురు లేవయ్యా! యనియీపద్య భావము. ఆవెనువెంటనే హరిహరరాయలు, ఫిరోజ్ ఖాన్ వంటి మహారాజుల ప్రశంసలు యీగ్రంధమున వర్ణింపఁబడినవి. ఇంతటితో నేటికి చాలింతము రేపు హరవిలాసములోని విలాసములను కులాసాగా విని మురియుదము, సెలవు.