Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -10

శా: ఈక్షోణిన్ నిను బోలు సత్కవులు లేరీ నేటి కాలంబు నన్
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ,
వక్షోజ ద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భావంబు న
ధ్యక్షించున్ గవిసార్వ భౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్;
కాశీఖండము- కృతిపతి ప్రశంస
భావం: ఓ కవిసార్వభౌమా! ఈలోకంలో నేడు నీవంటి సత్కవులు లేరు. దాక్షారామ చళుక్య భీమవరము లోని గంధర్వాప్సరో కాంతల వక్షోజములయందు పూయబడు కస్తూరీ చందన చర్చల యందలి సుగంధ వైభవములను నీకవిత నధ్యక్షించను; అనగా చక్కని కీర్తి పరిమళములతోను భావ పరీమళములతోను యొప్పారుచుండునని యభిప్రాయము. ఇంతకు దీనీని బట్టి శ్రీనాధుని కవిత్వము పౌఢ కవిత్వము. ఆప్రౌఢత సిధ్ధించుటు కారణమిది;
సీ: వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీలల నొక్కమాటు;
భాషింతు నన్నయ భట్టు మార్గంబున
నుభయ వాక్పౌఢి నొక్కొక్క మాటు;
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము
రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు;
పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు;
తే: నైషధాది మహా ప్రబంధములు పెక్కు
చెప్పి నాడవు మాకు నాశ్రితుడ వనఘ!
యిపుడు జెప్ప దొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర.
కాశీఖండము-అవతారిక
శ్రీనాధుని ప్రౌఢ కవిత్వమునకు మూలము కవిత్రయాను సరణము. గంభీరముగా నడుగునపుడు వేములవాడ భీమనను, సంస్కృ తాంధ్ర భాషాప్రయోగములందు నన్నయను, రస పోషణకు తిక్కన ను, సూక్తి వైచిత్రికి యెర్రనను, అనుకరించినాడు. కాదుకాదు వారి కవితా పధ్ధతులను అనుసరించినాడు. పరోక్షముగా కవిత్రయాను కరణమే నన్నితటి వాని నొనరించినట్లు శ్రీనాధుడే ధృవీకరించెను. ఇట్లు ఒక విలక్షణ మైన ప్రౌఢ కవితా శైలికి శ్రీనాధుడే శ్రీకారము జుట్టినాడు .ఈచక్కనిశైలి ఆగామి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనది . పెద్దనాది కవితల్లజు లెందరో తమ గ్రంధము లందు యితని శైలికి పట్టము గట్టినారు. అల్లసాని వారైతే ఈశైలిని పుణికి పుచ్చుకున్నారు. అందుకే మనుచరిత్రము నందలి పద్యములు శ్రీనాధశైలీ సుగంధముతో పరిమళించు చుండును .
ఇంత గొప్పవిద్వత్కవి వేశ్యాలంపటుడగుట విచిత్రము. నాటిపరిస్ధితులట్టివి .నిజమారసినచో 1ధనము2రూపము3యవ్వనము4అధికారము5విద్యాధిక్యము- లను నీయైదింటిలో నేయొక్కటి యధికముగానున్నను నది చాలును మానవ పతనమునకు యివి యన్నియు నొకచోట చేరినచో నిక చెప్పవలసిన పనిలేదు. శ్రీనాధునియందు యివి యన్నియు గలవు. శ్రీనాధునిరూపము అపురూపము
ఆరడుగుల ఆజానుబాహు విగ్రహము. పసి నిమ్మపండు వంటి పచ్చని శరీరఛ్ఛాయ. విశాల ఫాల భాగము. గోష్పాదమంత శిఖ దానికి ముచ్చలముడి. నుదుట విభూతిరేఖలు. భృకుటిలో యెర్రని కుంకుమ బొట్టువెడదయురము. కంఠమున రుద్రాక్షమాల,తారహారములు, కటిభాగమున చీనాంబరము, వలెవాటుగా శాలువా, కర్ణములకు మకర కుండలములు, చేతులకు కంకణములు, పాదమునకు బంగరు జలతారుతో చిత్రితమైన పాదరక్షలుచేతస్వర్ణమయ దండము. స్ధూలముగానిది యతని యాకారము మాటలలో చతురత సునిసిత హాస్యము.నడకలలో గాంభీర్యము.రారాజులనైన శాసింపగలయా బ్రాహ్మణ వర్చస్సు,వచస్సు. లు శాధుని మహోన్నతు నొనరించినవి. అంతవానిని కామినులు వలచి వలపించి నారనుట యద్భుతవిషమా? ఇక శ్రీనాధుడా కాంతలకు మానస సూనస సూనసాయకుడు,. కావునృనే యతని శృంగారము నిరాటంకముగా చెల్లుబాటయినది.
ఇకనితటితో నీనాటి యీ ప్ర స్ధానమునకు యవధి కల్పింతము

No comments:

Post a Comment