Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 12

సీ: కలశాబ్ధి కన్యకా కర పల్లవ ద్వయీ
సంవాహన క్రియా సముచితంబు;
నిఖిల వేదాంత వాఙ్నిధి వధూ ధమ్మిల్ల
బహుళ పుష్పామోద భాసితంబు;
ప్రణత నానా సుపర్వ కిరీట సంఘాత
రత్నాంశు రాజి నీరాజితంబు;
సనకాది సన్మునీశ్వర మనో మందిరా
భ్యంతర రత్న దీపాంకురంబు;
గీ: పతగ కేతను శ్రీపాద పంకజంబు
కారణంబుగ జన్మించె భూరి మహిమ
గంగ సైదోడు రిపుకోటి గళము త్రాడు
నాలుగవ జాతి సమధికోన్నత విభూతి!
ఈపద్యము శ్రీనాధమహాకవి వర్ణనా వైభమునకు పతాక! ఆగామి ప్రబంధ కవుల కిది యొజ్జ బంతి యైనది,.ఇందు ఇమ్మహాకవి తన కాశ్రయ మొసంగిన రెడ్జిరాజుల కుల వైభవమును వర్ణించుటవిషయము. రెడ్డిరాజులు నాలుగవ జాతికి జెందినవారు. విష్ణు పాదమునుండి వారికులము ఉత్పన్న మయినది . అందువలన విష్ణు పాదమహిమను సహేతుకముగా నీపద్యమున వివరింప బడుచున్నది.
భావము:- సముద్రుని కుమార్తె యగు శ్రీలక్ష్మి యొక్క చిగురు టాకులవంటి హస్తములచే సంవాహనము చేయ బడు చుండెడివి. ( కలుములరాణి శ్రీదేవి సేవలకు నోచికున్న వని భావము.) సకలవేదాంత స్వరూపిణి యగు మాతృసరస్వతి నిత్యము సిరసు వంచి నమస్కరించు నపుడామె సిగలోని పూలసోకుచేత పరిమళ భరితమగుచున్నవి.(సరస్వతి బ్రహ్మకు భార్య శ్రీహరికి కోడలు ) ప్రతి దనము నరుదెంచి నమస్కరించు దేవతల సిరోలంకారములగు కరీటముల లోని రత్న కాంతులతో నీరాజన మందునవి. సనకాది మునుల మనోమందిరము లందు రత్న దీపములై ప్రకాశించునట్టివి. అటువంటి పతగకేతనుని(శ్రీహరి) పాదకమలమునుండి, గంగకు తోడబుట్టినదియై, శతృవుల మెడలకు ఉరిత్రాడై, సమధిక వైభవముతో నుదయించినది.
విష్ణు పాదమహిమ నింతగా వర్ణించిన కవులు లేరు. కవికి గల యవసర మట్టిది. పోషకులాయె! వారి నామాత్రము వర్ణించుటలో దోషములేదుగదా! పైగా మహా పరాక్రమ వంతులు. వర్ణాశ్రమ ధర్మ సంరక్షకులు. శివభక్తిపరాయణులు. కవి పండిత పోషకులు. చరిత్రలో రెడ్డిరాజుల పరిపాలనా కాలము ఒక మహాధ్యాయము నకు నోచు కొన్నది. అగుగాక! మనమితటితో నీప్రసంగ మునకు స్వస్తి బలికి ప్రస్తుత విషము ననుసరింతము.
రాజమహేంద్రమున ఘనమగు వీడ్కోలు పొంది కతిపయ ప్రయాణములను సాగించుచు, కొండవీటికి జేరుటకు ఉపక్రమించెను. అప్పటికే శ్రీనాధకవి కులపతిగా ప్రసిధ్ధి నొందెను. కులపతియనగా, అనేకమంది విద్యార్ధులకు నివాసము, భోజన వసతి కల్పించుచు విద్యను బోధింతువారు కులపతుతులు. అప్పటికే యతనకడ విద్యాభ్యాసము నొనరించు విద్యార్ధులసంఖ్య యతిమాత్రముగానుండెను. వ్యాకరణము,సాహిత్యము, ఛందస్సు, జ్యోతషము, తర్కము, అలంకార శాస్త్రాదులను బోధించు చండెడివాడు. అట్టి శిష్యగణము. రాజపరివారము, వండి వడ్డించు వారు వాహనములు పటకుటీర పరికరములు, ఇట్లొకచిన్న పట్టణమే కదలి వచ్చు చున్నట్లు చూపరకు గనుపట్టు చుండెను . ఉదయము కొంతదూరము ప్రయాణము. మధ్యాహ్నమున విశ్రాంతి భోజనాదులు తదుపరి కొంతవరకు ప్రయాణము రేయి యగుసరికి మరోచోటమజలీ ఇదీవారి యాత్రాటోపము.
మనము పాకనాటినుండి, రాజమహేంద్రి వరకు శ్రీనాధునితో పయనించితిమి. ఇంవరకు అతని సంసారమును గురించి యతడొక్క మాటయైనను జెప్పలేదు. గ్రంధము లందా దాఖలాలు లేవు. చరిత్రకారులకు యిదియొక శేష ప్రశ్నగా మిగిలి పోయినది. హరవిలాసమున మాత్రము తాత గారిని, తలిదండ్రు లయిన మారనామాత్య భీమాంబికల పేర్లు మాత్రము వెల్లడించినాడు. మరి పోతనతో సంబంధము ఎట్లు పొసగును? చిలవలు పలవలుగా వారియిరువురి సంబంధమును గురించిన కధలల్లినారే! అవియన్నియు పొసగని విషయములేకదా! పుట్టని బిడ్డకు పేరు బెట్టుటయేకదా!
ఇంతటితో నేచికీ ప్రసంగము నాపుదము. రేపు శ్రీనాధని కొండవీటికి జేర్చి తక్కిన విషయములు ముచ్చటించు కొందము. నేచికింక సెలవు.

No comments:

Post a Comment