Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 15

కం:- రసికుడు పోవడు పలనా
డెసగంగా రంభ యైన యేకులె వడకున్;
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుం డైన జొన్న కూడే గుడుచున్;
నిన్నటి చివరి పద్యమున అంగడి యూరలేదు అంటూ శ్రీనాధ కవీంద్రుడు పలనాటి పల్లెలయందలి లోపములను యెలుగెత్తి సాటెను. జనుల జీవనోన్నతికి వాణిజ్య కేంద్రములు సూచికలు . అవిలేనిచోటులు రాణింపవు.
మనకవియా నిరంతర భోగపరాయణుడు. పగలు తిండితిప్పలకు లోటుండరాదు. రేయికి పడక సౌఖ్యము సరేసరి. ఈరెండును నిచట లభీంచునట్లు లేదు వెలయిచ్చి కొందమన్నను అంగడులులేవు. వరియన్నమా పూజ్యము. " ముఖ్యమైన విషయము అంగన లింపులేరు. అయ్యో! ఎంతకష్టము వచ్చిపడినది? వీటికి తోడు త్రిసవణ స్నానాదులాచరించుచు త్రికాల సంధ్య నుపాసించు శ్రీనాధునకు స్నానపానములకు వలసిన నీరేకరవయ్యెను. " నీటికైభంగపడంగ తోడ్పడెడు వారలు కూజలేరని వాపోయినాడు .ఇకయిట్టి పలనాటికి మాటి మాటి కేలరావలెను? అని మనస్సులో కసిదీర విసిగికొనినాడు.
వెంటనే తన యభిప్రాయమును నిర్మొగమాటముగా వచిచినాడు. రసికుడెవ్వడీ పలనాటికిరానేరాడు. రంభ లాంటిఅందగత్తెయైనా యిక్కడ యేకులు వడుకుతూ కూరిచోవలసినదే! మహారాజైనను మడి దున్నవలసినదే! మన్మధుడయినను జొన్నకూడే దినవలెను. వేరు మార్గము శూన్యము.
ఇట్లు అన్నోదకములకై వెంపర లాడుచు మనకవి యచ్చటి పురోహితునింటికి బోయెను. అచటి యశౌచవాతాపరణము ను జూచి యతనికి వికారము బుట్టినది. ఎంతరోత! ఛీ ఛీ యిదియు నొకబ్రతుకా? యని నిర్వేదము జనించెను. అయినను అతని పరిశీలనా చక్షువులకు కొన్ని రోత కలిగించు దృశ్యములు చిక్కనే చిక్కినవి;
ఉ:- దోసెడు కొంపలో పశుల ద్రొక్కిడి మంచము దూడరేణమున్ ,
పాసిన వంకంబు పసి బాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు బోడికుండలున్
రాసెడు కట్టెలున్ దలప రాదు పురోహితు నింటి కృత్యముల్;
ఇవి యచట యతని కనుల బడ్డ యపూర్వ విష యములు. వెంటనే నిరసించుచు ఆశువు శ్రీనాధుని నోట దూసుకొని వచ్చినది. వడిసెల లోనిరాయికివలె ఆశువునక వేగమధికమే! వచ్చినపద్యము నొడిసి పట్టినారు శిష్యులు. వారిపనియే అది.పద్యమును విచారింతము! ఏమిపరిశీలనా సామర్ధ్యము !
పురోహితునియిల్లు దోసెడున్నదట! అదీ నుడికారవైభవము. ఆయున్న చిన్నయిల్లు వారుండుటకే సరిపోదు. అట్టిదానిలో గోదానాదుల వలన లభించిన పశువులను గట్టుచున్నారట! అవి అక్కడనే మలమూత్రాదులను విసర్జించుటచే భరింపరాని దుర్గంధము. ఆప్రక్కనే నులక మంచము దానికి లేగలు బంధింప బడినవి వాటిమలమూత్రాదులచే నిల్లు వెగటు బుట్టించు చున్నది. ఒకప్రక్క వంటగది తెఱచిన మూతగల గిన్నెలు వానియందు నిన్నటి వంటకము పాసిపోయి కంపుకొట్టు చుండెను. వారింటి పసిబాలురు నియంత్రణ లేమి నిల్లంతయు మూత్ర సేచన మొనరించుచన్నారట! విస్తరాకులు యిల్లంతా చిదరగాపడియున్నవి. మాసిన వస్త్రాదుులు యిల్లంతాపరచుకున్నాయి. (వెనుకటి తరమువారు భర్త గతించాక తలకు ముండనము చేయించు కునేవారు నెలకు రెండుమారులు ఆకార్యృక్రమము బ్రాహ్మణగృహములందు పరిపాటి) ఇక్కగ క్షురకుడు అందుబాటులోలేకపోవుటచే
ఆవిశ్వస్తల తలలు మాసియున్నాయట! కాళీగాఉన్నపాత్రలు. పొయిలోవాడి మండించి మిగిలిన భాగములను ఆర్పి వానినింట నుంచు కొన్నారట! ఎంత నిశిత పరిశీలనము! ఇవీ పలనాటి పురోహితుని ఇంటిలో కనిపించిన యపూర్వ దృశ్యములు. ఛీ తలపరాదు పురోహితు నింటి కృత్యముల్!
ఇకచేసెడిదేమి? నీటికై వెదకి వేసారి పరమేశ్వరునే తూర్పార బట్టుటకు దెగబడినాడు.
కం:- సిరి గల వాడికి జెల్లును
దరుణుల బదియారువేలు దగ బెండ్లాడన్;
తిరిపెమున కిద్ద రాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్!
ఇందు లౌకిక అలౌకిక ములగు రెండర్ధములను కవి యిమిడించినాడు. 1 ధనవంతుడు యెందరినైను బెండ్లి యాడవచ్చును. పోషణకు లోపముడదుగనుక, బిచ్చగానికి యిద్దరున్నను పోషించుట కష్టమేయగుట లౌకికము.2ఓపరమేశా! హరి సిరి గలవాడు( లక్ష్మీనివాసుడు) కావున నాతడు పదియారు వేల భామలను పెండ్లి యాడినను దోసమనిపించదు. మరి నీవో అట్లుగాదే? బిచ్చగాడవుగదా! నీకేలనయ్యా యిద్దరు భార్యలు.పార్వతి యొక్కతె చాలులెమ్ము; గంగను మాకువిడువుము; అంటాడు. గంగమ్మని శివుడు విడిచాడో లేదో తెలియదు గాని పద్యం మాత్రం చాటువుగా మిగిలి పోయింది; శ్రీనాధుడు అక్షర తపస్వి! ఈతీరుగా అక్షరుడై చరిత్రలో మిగిలిపోయినాడు. నేటి కింతటితో నీప్ర సంగమును నిలువ రింతము. రేపు తక్కినది. సెలవు!

No comments:

Post a Comment