Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -14

సీ : చక్కని నీ ముఖ చంద్ర బింబమునకు
కల్యాణ మస్తు ! బంగారు బొమ్మ!
నిద్దంపు నీ చెక్కు టద్దంపు రేకకు
నైశ్వర్య మస్తు! నిద్దంపు దీవి!
మీటిన బగులు నీ మెఱుఁగు బాలిండ్లకు
సౌభాగ్యమస్తు! భద్రేభ యాన!
వలపులు గులుకు నీ వాలుగన్నులకు న
త్యధిక భోగోస్తు! పద్మాయతాక్షి!
గీ : మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును
వైభవోన్నతిరస్తు! లావణ్య సీమ !
వన్నె చిన్నెలు గల్గు నీ మన్న నలకు
శాశ్వత స్థితి రస్తు! యోషాలలామ!
శ్రీ నాధుని చాటువు
శ్రీనాధ మహాకవి ప్రస్థానము సాగుచున్నది. రక్షణకుగాను వెంటనంటిన సైనికులు అశ్వ ములమీదను, శిష్యగణము ,ఆశ్రిత పరివారమంతయు శకటముల యందును మరికొందరు పాద చారులై యనుసరింపగా , శ్రీనాధ కవి చంద్రుడు స్వర్ణ పల్యంకిక నధిరోహించి బోయీలు ఓంకార నాదములతో దిగంతములను మారు మ్రోగించుచుండగా ప్రయా ణమును సాగించు చుడెను.
మధ్యేమార్గమున శ్రీనాధునకు ఒక చక్కని సుందరాంగి కన్నుల లోబడెను. తత్ఫలితమే పైసీస పద్యము. శ్రీనాధునిది విచిత్రమైన సునిశితమైన పరిశీలనా శీలము. అతని కన్నులలో బడిన దానిని విడువడు. అదియొక ప్రదేశముగావచ్చును, స్త్రీ పురుషులు గావచ్చును , రాైనను పేదయైననూ నతని దొక్కటే దృష్టి. సుందరమా ! అది యంగాంగ వర్ణనమే! కురూపమా! అదియునంతే! ఆవర్ణనమువెనుక నొకహేళనము, ఒకవిధమైన రోత, వర్ణనా సందర్భమున నతనికి సభ్యతా సభ్యతలు పట్టవు. ఆస్వరూపము కన్నుల గట్టవలసినదే! అప్పటి వరకు తనివి నొందడు.
ఇప్పట్టున పాఠరులకొక మనవి . శ్రీనాధుని కవితా ప్రవాహము గంగా ప్రవాహము వంటిది. గంగా ప్రవాహంలో అక్కడక్కడ చెత్త చెదారము లుండవచ్చును . అవి యా గంగాప్రవాహ పవిత్రతను అడ్డుకొన జాలవుగదా?
అట్ల శ్రీనాధుని పద్యముల లోని విచ్చలవిడి శృంగార మతని భోగేఛ్ఛకు సూచక మగునే గాని యతని కవితా మహాధారకు, భావనాచాతుర్యమునకు యేమాత్రము ఆటంకము కాజాలదని నామనవి; శృంగారపు పాలు మించిన తావుల లోని పద్యములను విజుచుటగాని, లేదా భావమును పాఠకుల యూహకు వదలుటగాని యొనరించుచు , నేనీతని ప్రస్థానమును నిర్వ హింపగలనని సవినయము గా మనవి చేయుచు ముందుకు సాగు చున్నాను.
శ్రీనాధుని ప్రయాణము మతివేగముగా సాగుచున్నది. మనమిప్పుడు గుంటూరి సీమకు చివరనున్న పలనాటిని సమీపించితిమి. ఇంతవరకు నాగరిక వేషభాషలతో మురిపించిన గుటూరిసీమ ఈప్రాంతమునకు చేరుసరికి అతివికృతముగా కన్పించెను.(పాఠకులు15వ శతాబ్దము నాటి పలనాటి నేపథ్యమును మనస్సులో నుంచు కొనవలెను ఇప్పటి పలనాటికి అప్పటి పలనాటికి పోలికలేదు) వర్షాభావమున నెండినచేలు. నల్లమలకు చేరువనుండుటచే కట్టు బొట్టులకు తిండి తిప్పలకు చాల వ్యత్యాసము గలిగి యనాగరిక వాతావరణమునకు చేరువయై చూపరులకు వెగటు కల్గించుచుండెను.
గీ:చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటినీళ్ళు నాప రాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లె నాటి సీమ పల్లె టూళ్ళు;
పరమ సుకుమారుడు మహా భోగియు నగు శ్రీనాధుని కచటి దృశ్యము లన్నియు విషప్రాయములయ్యెను. దారిబత్తెమునకై తాము దెచ్చుకున్న ఆహారపదార్థము లన్నియు నిండుకున్నవి . ఇకస్థానికముగా వస్తువులను కొనుగోలుచేసికొని పొట్టనిపుకొనవలసియుండెను. కానీ ఆపల్లెలలో నంగడులేలేవు. శ్రీనాధునకు ఒజలుమండెను.
ఉ: అంగడి యూరలేదు; వరి యన్నములేదు; శుచిత్వ మేమి లే
దంగనలింపులేరు; ప్రియమైన వనంబులు లేవు; నీటికై
భంగ పడంగఁబాల్పడు కృపాపరు లెవ్వరు లేరు; దాత లె
న్నంగను సున్న! గాన పలనాటికి మాటికి బోవనేటికిన్;
అంటూ ఆప్రాతం పైన తన నిరసన చాలాతీవ్రంగా ప్రకటించినాడు.
నేటితో నీప్రసంగమును నిల్వరింతము. ముందు ముందు మరిన్ని వింతలు వినోదాలు. ఇకదారి పొడుగునా పద్యాల జల్లులే! పాఠకులు సావధానులై యుందురుగాక! సెలవు !

No comments:

Post a Comment